Aap Maha Rally At Delhi : దిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఆర్డినెనన్స్కు వ్యతిరేకంగా ఆప్ ఆదివారం రామ్లీలా మైదాన్లో నిర్వహించిన 'మహా ర్యాలీ'లో దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగించారు. ఈ తరహా ఆర్డినెన్స్ త్వరలోనే ఇతర రాష్ట్రాల్లోనూ రానుందని వేదికపై నుంచి హెచ్చరించారు. అందరూ కలిసి ఐక్యంగా దీన్ని అడ్డుకోవాలన్నారు.
'నేను దేశ ప్రజలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆర్డినెన్స్ కేవలం దిల్లీ ప్రజల కోసమే అని భావించవద్దు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మొదటి దాడి అని నాకు అంతర్గతంగా తెలిసింది. దిల్లీ ప్రజల అధికారం దోచుకునే విధంగా ఉన్న ఆ ఆర్డినెన్స్ను త్వరలోనే రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ తీసుకురానున్నారు. ఇది వారి నియంతృత్వ వైఖరికి నిదర్శనం. దీన్ని ఇప్పుడే ఆపాలంటే మనమంతా ఐక్యం కావాలి' అని ఆప్ ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
"కొందరు బీజేపీ నాయకులు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. నేను వాటిని పట్టించుకోను. కానీ కేంద్ర ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానించే రీతిలో ప్రవర్తిస్తే.. నేను సహించను. కేంద్రం రాజ్యాంగాన్ని నమ్మదు. ఆర్డినెన్స్పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ప్రధాని మోదీ తిరస్కరించడం ఆయన నియంతృత్వానికి అద్దం పడుతోంది. దిల్లీలో ప్రస్తుతం నిరంకుశపాలన కొనసాగుతోంది. రామ్లీలా మైదాన్.. 12 ఏళ్ల క్రితం దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అప్పడు ఆ ఉద్యమం విజయవంతమైంది. ఇప్పుడు మళ్లీ ఇదే రామ్లీలా మైదాన్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఉద్యమానికి వేదిక అయ్యింది. ఈ ఉద్యమం కూడా విజయవంతమవుతుంది" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అరెస్ట్లపై స్పందించిన కేజ్రీవాల్..
"దిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్లను అరెస్ట్ చేసింది. కానీ మాకు 100 మంది సిసోదియాలు, మోర 100 మంది జైన్లు ఉన్నారు. వారి పని వారు చేసుకుంటారు" అని కేజ్రీవాల్ వ్యాఖానించారు. కాగా, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో గతేడాది మేలో జైలుకెళ్లారు.
మోదీజీ గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా 21 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఆయన చేయలేని ఎన్నో పనులు కేజ్రీవాల్ ఎనిమిదేళ్ల పదవీ కాలంలో చేశారని అన్నారు. బీజేపీ.. దిల్లీలో మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఆప్ దిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తే.. మోదీజీ దిల్లీలో ఉచిత యోగా తరగతులు నిలిపివేశారని మండిపడ్డారు.