Cracker Less Diwali To Protect Migratory Birds :వలస పక్షుల రాకను దృష్టిలో ఉంచుకుని దీపావళి పండగకు టపాసులు కాల్చకూడదని నిర్ణయించుకున్నారు తమిళనాడు.. శివగంగ జిల్లాలోని కొల్కుడ్పట్టి గ్రామస్థులు. మరి ఎందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారో? దీని వెనుక ఉన్న కథెంటో ఓ సారి తెలుసుకుందాం.
కొల్కుడ్పట్టి గ్రామ పరిసరాల్లోని వెట్టంగుడి అభయారణ్యానికి కొన్ని దశాబ్దాలుగా వలస పక్షులు వస్తున్నాయి. అక్కడే కొన్ని రకాల పక్షులు పిల్లల్ని కంటున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో స్విట్జర్లాండ్, రష్యా, ఇండోనేషియా, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాల నుంచి వెట్టంగుడి అభయారణ్యానికి దాదాపు 15 వేల పక్షులు వలస వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే వలస పక్షుల రాక మొదలైందని స్థానికులు చెబుతున్నారు.
అభయారణ్యానికి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వివిధ జాతుల పక్షులు వస్తాయి. గ్రే హెరాన్లు, డార్టర్లు, స్పూన్బిల్స్, వైట్ ఐబిస్, ఏషియన్ ఓపెన్ బిల్ కొంగలు, నైట్ హెరాన్లు, పెయింటెడ్ కొంగలు, లిటిల్ కార్మోరెంట్లు, పిన్టైల్ లిటిల్ ఎగ్రెట్స్, ఇంటర్మీడియట్ ఎగ్రెట్స్, ఎగ్రెట్స్, కామన్ టీల్స్ వంటి వివిధ రకాల వలస పక్షులు వస్తాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ అభయారణ్యం 38 ఎకరాల విస్తీర్ణంలో ఉందని వెల్లడించారు. దాదాపు అర్ధశతాబ్దం నుంచి 200 జాతుల వలస పక్షులు వెల్లంగుడి అభయారణ్యానికి వస్తున్నాయని చెప్పారు.