Court Verdict After 31 Years : 31 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓ కేసులో 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ రాజస్థాన్లోని భరత్పుర్ ఎస్సీ/ఎస్టీ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. మరో 41 మందిని నిర్దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో 36 మంది నిందితులు చనిపోయారు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని కుమ్హెర్ ప్రాంతంలో 1992 జూన్ 6న స్థానికంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 45 మందికి గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. మొదట ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. దర్యాప్తు క్రమంలో మొత్తం 283 మంది సాక్షులను సీబీఐ విచారించింది. వారి వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 87 మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు సీబీఐ అధికారులు.
అయితే 31 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో 36 మంది నిందితులు మరణించారు. ఇన్నేళ్ల పాటు వాదోపవాదాలు జరిగాక.. తాజాగా శనివారం ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సమయంలో కోర్టుకు 50 మంది నిందితులు హాజరయ్యారు. ఇందులో 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గిర్జా భరద్వాజ్ తీర్పు వెలువరించారు. మిగతా 41 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల్లో రామ్ సింగ్, మంకలమ్ జైన్, బేదో, జయ్ సింగ్, భన్వర్ సింగ్, శివ్ సింగ్ కుమారుడు రామ్ సింగ్, ఫౌడీ సింగ్, గిర్రాజ్, గోపాల్ ఉన్నట్లు న్యాయవాది రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు.