తలకు గాయమైన ఓ మహిళకు కండోమ్ కవర్ను పెట్టి కట్టు కట్టారు పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. మధ్యప్రదేశ్.. మురేనాలో ఈ ఘటన జరిగింది. రక్తం అదుపు కాకపోవడం వల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహిళను పంపించగా.. కండోమ్ కవర్ విషయం వెలుగులోకి వచ్చింది. అసలేమైందంటే..
ధరమ్గఢ్ గ్రామానికి చెందిన బాధిత మహిళ తలకు ప్రమాదవశాత్తు గాయమైంది. దీంతో వైద్యం చేయించుకొనేందుకు స్థానిక పీహెచ్సీకి వెళ్లింది. ఆమె తలకు కట్టుకట్టి పైఆస్పత్రికి పంపించారు అక్కడి సిబ్బంది. కాగా, గాయపడిన మహిళకు కుట్లు వేసేందుకు కట్లు విప్పిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు.. పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వాకం బయటపడింది. బాధితురాలి గాయాలకు కండోమ్ కవర్ పెట్టి కట్లు కట్టినట్లు తేలింది. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. దూదితో కట్లు వేయడానికి బదులుగా కండోమ్ కవర్ను అడ్డుగా పెట్టి కట్టు వేయడంపై ఆరోగ్యశాఖ అధికారులు మండిపడ్డారు.