CAG REPORTS ON AP BARROWS: రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశం కొట్టి పడేయలేమని.. కాగ్ స్పష్టం చేసింది. స్థూల ఉత్పత్తిలో రుణ నిష్పత్తి 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య పెరుగుదల సరళిని..కాగ్ నమోదు చేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక వాహక నౌకల ద్వారా తీసుకున్న రుణాల పైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 మార్చి 31 నాటికి జీఎస్డీపీలో రుణాల శాతం 31శాతమే ఉన్నట్లు ప్రభుత్వం చూపుతున్నా.. నిజానికి రాష్ట్ర రుణాల భారం అంతకుమించి ఉంది.
బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే.. జీఎస్డీపీలో రుణాల శాతం 42.33గా ఉంది. ఇది నిర్దేశించిన పరిమితి కన్నా 6.73శాతం అదనం అని కాగ్ స్పష్టం చేసింది. ఈ రుణభారాన్ని అధిగమించడానికి ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతోపాటు.. రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని.. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉందని కాగ్ కుండబద్దలు కొట్టింది. అంటే చేసిన అప్పులు తీర్చుకునేందుకు రాబడి పెంచుకోకుంటే అభివృద్ధి శూన్యమయ్యే పరిస్థితి ఉంటుందని కాగ్ విశ్లేషించింది.
ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే.. 2021 - 22 నుంచి ప్రారంభిస్తే 2030 - 31నాటికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల 47 వేల 944కోట్ల 64 లక్షలు వడ్డీలు, అసలు కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. 2024 - 25లో రుణాలు తిరిగి చెల్లించే బాధ్యత పతాక స్థాయికి చేరనుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో.. ప్రస్తుత లెక్కల ప్రకారం 42వేల 362కోట్ల 20 లక్షల రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రుణ బాధ్యత సరళి.. కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నా ఆదాయాలు పెంచుకోకుండా ఖర్చుల కోసం బహిరంగ మార్కెట్ రుణాలు, ఇతర అప్పులపై ఆధారపడితే... రుణ భారం మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం ఈ అప్పులు చేయడంలేదని కాగ్ నివేదిక పేర్కొంది. ‘‘2017-18 నుంచి 2021-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి.. ఆ సొమ్ముతో పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తోంది. కొత్త అప్పుల్లో 65 నుంచి 83 శాతం మొత్తాన్ని పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తున్నారు. ఈ అప్పులు.. మూలధన ఆస్తుల సృష్టికి కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు.. ఆ సరళి తెలియజేస్తోంది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించకుండా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి.. రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపడేయలేమని కాగ్ హెచ్చరించింది.