తెలంగాణ

telangana

నరేంద్ర మోదీపై కేసు.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారని..

By

Published : Apr 27, 2023, 11:43 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు అందాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేరళలో ఓ వ్యక్తి ప్రధానిపై ఫిర్యాదు చేశారు. నిబంధనలు అందరూ పాటించాలని పేర్కొన్నారు. మరోవైపు, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని పేర్కొంటూ కర్ణాటక కాంగ్రెస్ నేతలు అమిత్ షాపై ఫిర్యాదు చేశారు.

modi traffic violation kerala
modi traffic violation kerala

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కేరళలో ఓ వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొచ్చిలో మోదీ నిర్వహించిన రోడ్​షోలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని త్రిస్సూర్​కు చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. రోడ్​షోలో భాగంగా మోదీ.. కారు డోర్​కు వేలాడుతూ ప్రయాణించారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రోడ్డు కనిపించకుండా వాహనం అద్దాలపై పూలు చల్లడం కూడా నిబంధనలకు విరుద్ధమేనని తెలిపారు. జయకృష్ణన్ అనే వ్యక్తి ఈ మేరకు బుధవారం.. కేరళ డీజీపీ అనిల్​కాంత్​తో పాటు ఆ రాష్ట్ర మోటారు వాహన శాఖకు కంప్లైంట్ ఇచ్చారు. చట్టం అందరికీ సమానమేనని.. అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏప్రిల్ 24న కొచ్చిలో పర్యటించారు ప్రధాని మోదీ. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. వందేభారత్ రైలు, వాటర్ మెట్రో, డిజిటల్ సైన్స్ పార్క్​లను ప్రారంభించారు. యూవం కాంక్లేవ్​లో పాల్గొనే ముందు.. కొచ్చిలో రోడ్​షో నిర్వహించారు మోదీ. కారు డోర్​ పట్టుకొని నిల్చున్న ఆయన.. రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 1.8 కిలోమీటర్ల పాటు ఈ రోడ్​షో కొనసాగింది. కేరళలో ప్రధాని మోదీ ఇంత సుదీర్ఘ ర్యాలీ చేపట్టడం ఇదే తొలిసారి. ర్యాలీ సందర్భంగా మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు ప్రజలు. ఆయనపై పూలు చల్లారు. ఏప్రిల్ 25న తిరువనంతపురంలోనూ మోదీ రోడ్​షో నిర్వహించారు.

మోదీ రోడ్​షో
మోదీ ప్రయాణిస్తున్న కారుపై పూల వర్షం

హోంమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య శతృత్వం ఏర్పడేలా విద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్షానికి చెడ్డపేరు వచ్చేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్.. బెంగళూరు హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా.. కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

"కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని అమిత్ షా ఆరోపించారు. పీఎఫ్ఐపై బ్యాన్​ను తొలగిస్తారని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. కాంగ్రెస్​కు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు వ్యాప్తి చేసేలా ఉన్నాయి."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి

మంగళవారం బాగల్​కోటె జిల్లాలోని తెరదాళలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరుకుంటుందని అన్నారు. కుటుంబ రాజకీయాలు పెరిగిపోతాయని.. రాష్ట్రం మొత్తం అల్లర్లతో సతమతమవుతుందని చెప్పారు. 'ఇవి ఎమ్మెల్యేలు, మంత్రులకు జరిగే ఎన్నికలు కావు. ఈ రాష్ట్ర భవిష్యత్​కు సంబంధించిన ఎన్నికలివి. కర్ణాటక భవిష్యత్​ను మోదీకి అప్పగించండి' అని షా పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details