ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయిన తర్వాత గవర్నర్ను కలిసేందుకు సిద్ధమవడం వల్ల.. ఆయన తన రాజీనామాను సమర్పించేందుకే కలువబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే, రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా ఉండేందుకే తీరత్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరత్ సింగ్ రాజీనామా చేసేందుకు సిద్ధమవ్వడం గమనార్హం.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరు నెలల్లోపే ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నా.. ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా ఉప ఎన్నికలు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గడువు ముగిసేవరకు ఇలాగే పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమ మార్గమని భావించినట్లు తెలుస్తోంది.