Cleanest City in India :దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా ఇందౌర్, సూరత్ నిలిచాయి. ఈ మేరకు 2023 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల జాబితాలో తొలి స్థానం సంపాదించాయి. నవీ ముంబయి మూడో స్థానంలో నిలిచింది. బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ కేటగిరీలో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ తర్వాతి ర్యాంకులు దక్కించుకున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరం ( Indore Cleanest City Award) అత్యంత పరిశుభ్ర నగరంగా రికార్డుకెక్కడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. ఈసారి ఇందౌర్కు తోడుగా గుజరాత్లోని సూరత్ సైతం తొలి ర్యాంకు దక్కించుకుంది.
మధ్యప్రదేశ్కు చెందిన బుద్నీ, మౌ, అమర్కంఠక్ సహా ఆరు నగరాలకు సైతం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయి. ఛత్తీస్గఢ్కు చెందిన ఐదు నగరాలు సైతం అవార్డులు అందుకున్నాయి. 4,447 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 సర్వేలో పాల్గొన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య సర్వే ఇదేనని కేంద్రం వెల్లడించింది. 12 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలు తీసుకుని సర్వే నిర్వహించినట్లు తెలిపింది.
- లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల్లో సాస్వడ్ (మహారాష్ట్ర)కు తొలి స్థానం. రెండు, మూడు స్థానాల్లో పాటన్(ఛత్తీస్గఢ్), లోణావాలా(మహారాష్ట్ర).
- పరిశుభ్రమైన గంగాతీర పట్టణంగా వారణాసి. రెండో స్థానంలో ప్రయాగ్రాజ్. రెండూ యూపీ నగరాలే.
- పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుల్లో మధ్యప్రదేశ్లోని 'మౌ'కు తొలి స్థానం.
'వచ్చే ఏడాదీ మేమే!'
గురువారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఇందౌర్ సిటీకి దక్కిన అవార్డును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.
"పరిశుభ్రంగా ఉండటం ఇందౌర్ ప్రజల అలవాటు మాత్రమే కాదని, వారి ఆలోచనల్లో ఇది ఇమిడిపోయిందని ఇప్పుడు నిరూపితమైంది. పరిశుభ్రత విషయంలో ఇది అతిపెద్ద విజయం. మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్ను సాకారం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిజ్ఞ పట్ల మధ్యప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉన్నారు" అని ఎంపీ సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది సైతం తొలి ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.