CJI DY Chandrachud on Ranjan Gogoi : న్యాయమూర్తులు పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత చేసే వ్యాఖ్యలన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాల కిందకే వస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయపరంగా వాటికి కట్టుబడి ఉండటం కానీ, వాటిని అనుసరించాల్సిన అవసరం కానీ ఉండదని స్పష్టం చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై మాజీ సీజేఐ, నామినేటెడ్ రాజ్యసభ ఎంపీ జస్టిస్ రంజన్ గొగొయి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా.. సీజేఐ ఈ మేరకు పేర్కొన్నారు.
DY Chandrachud Ranjan Gogoi Basic Structure Doctrine : దిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం మాట్లాడిన జస్టిస్ గొగొయి.. కేశవానంద భారతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. "కేశవానంద భారతి కేసుపై మాజీ సొలిసిటర్ జనరల్ టీఆర్ అంధ్యరుజిన రాసిన ఓ పుస్తకాన్ని నేను చదివాను. రాజ్యాంగ మౌలిక స్వరూపం అంశం న్యాయపరంగా తీవ్రంగా చర్చించాల్సి ఉంది. ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమీ చెప్పను" అని జస్టిస్ గొగొయి వ్యాఖ్యానించారు.
భారత న్యాయ చరిత్రలో కేశవానంద భారతి కేసును అత్యంత కీలకమైన తీర్పుగా భావిస్తారు. 1973లో ఈ కేసు తీర్పును 13 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యావాదం, రూల్ ఆఫ్ లా వంటి అంశాలను సమూలంగా మార్చేసే అధికారం పార్లమెంట్కు లేదని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది.
కాగా, జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై వాదనల సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత మహ్మద్ అక్బర్ లోనె తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్.. రాజ్యసభలో జస్టిస్ గొగొయి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. "జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు అనేది రాజ్యాంగవిరుద్ధమని వాదించారు. 'కొత్త న్యాయపరమైన సిద్ధాంతాలను తయారు చేసుకుంటే తప్ప ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగవిరుద్ధమే. కొత్త నిబంధనలు తయారు చేసుకుంటే వారు (కేంద్రం) మెజారిటీ ఉన్నంత వరకు ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ సహచరుల్లో ఒకరు.. రాజ్యాంగ మౌలిక సిద్ధాంతంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు" అని సిబల్ పేర్కొన్నారు.
'అలా అనొద్దు'
సిబల్ వ్యాఖ్యలకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. "మిస్టర్ సిబల్.. మీరు సహచరులు అని పదం వాడినప్పుడు సిట్టింగ్ జడ్జిల గురించి మాత్రమే మాట్లాడాలి. మేం జడ్జిలుగా పదవీ విరమణ చేశాక.. మేమేం మాట్లాడినా అది అభిప్రాయం కిందకే వస్తుంది" అని స్పష్టం చేశారు. కాగా, గతంలో రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని ధ్రువనక్షత్రంగా అభివర్ణించారు సీజేఐ చంద్రచూడ్. రాజ్యాంగాన్ని అమలు చేసేవారికి, నిర్వచించే వారికి అది దిశానిర్దేశం చేస్తుందని అన్నారు.
కాగా, విచారణ సందర్భంగా జమ్ము కశ్మీర్పై బ్రెగ్జిట్ తరహా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం విచారణ అంతా.. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశంపైనేనని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ సంస్థల ద్వారానే ప్రజాభిప్రాయం సేకరిస్తామని సీజేఐ చంద్రచూడ్ గుర్తు చేశారు. బ్రెగ్జిట్ (ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమణ) తరహాలో కశ్మీర్ నిర్ణయం సైతం రాజకీయ ప్రేరేపితమైనదని కపిల్ సిబల్ వాదించారు. రాజకీయ నిర్ణయమే అయినప్పటికీ.. భారత్ వంటి రాజ్యాంగం ఉన్న దేశానికి రిఫరెండమ్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని సీజేఐ స్పష్టం చేశారు.