CJI Chandrachud Interview :ఏదైనా కేసులో తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తులు రాజ్యాంగం, చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అన్నారు. ఒకసారి తీర్పు వెలువడిన తర్వాత అది దేశంతో పాటు ప్రజల ఆస్తి అవుతుందని పీటీఐతో ముఖాముఖిలో చెప్పారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏకగ్రీవ తీర్పుపై వస్తున్న విమర్శలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించిందని చెప్పడం సరికాదన్న CJI అందులో మరింత పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకు ఇటీవల అత్యన్నత న్యాయస్థానం నిరాకరించిన అంశంపై విమర్శల పట్ల కూడా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
'ఏదైనా కేసులో తీర్పు వెలువడే వరకు దాని నిర్ణయంలో పాల్గొన్న న్యాయమూర్తుల వరకే ఆ ప్రక్రియ పరిమితమై ఉంటుంది. న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి వచ్చి తీర్పు వెలువరించిన తర్వాత అది జాతి ఆస్తి. మనది స్వేచ్ఛా సమాజం. వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ హక్కును పరిరక్షించే రాజ్యాంగం మనకు ఉంది. అందువల్ల ప్రజలు తమ వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛతో విమర్శించడం, అభినందించడం వంటివి చేసేందుకు అర్హులు. మాకు(న్యాయమూర్తులకు) సంబంధించినంత వరకు రాజ్యాంగం, చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. విమర్శలకు ప్రతిస్పందించడం లేదా నా తీర్పును సమర్థించడం నాకు సముచితమని నేను అనుకోను. తీర్పులో మేము చెప్పింది సంతకం చేసిన తీర్పు ప్రతిలో ప్రతిబింబిస్తుంది.' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
'భారత రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి ఉంటాం'
తీర్పులు ఇచ్చేముందు సమాజం ఎలా స్పందిస్తుందనే విషయాన్ని కోర్టులు ఆలోచించవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. న్యాయమూర్తులు భారత రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి ఉంటారని ప్రభుత్వాలకు కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు ఉన్న తేడా ఇదేనని సీజేఐ వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం హిందుస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాయకత్వ శిఖరాగ్ర సమావేశంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.