Children vaccination in India: 18 ఏళ్ల లోపు చిన్నారులకు కొవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కేంద్రం సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. 15-18 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాలు ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించిన కేంద్రం.. రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. టీకా తీసుకోవాలనుకునే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని కొవిన్ చీఫ్ డా.ఆర్ఎస్ శర్మ సూచించారు.
రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జనవరి 1 నుంచి 15-18 ఏళ్ల వయస్కుల కోసం టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
కొవిన్ యాప్లో టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లబ్ధిదారులు తమ పేరు, వివరాలను నమోదు చేసి అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది.
ఏఏ గుర్తింపు పత్రాలు అవసరం?
ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కొవిన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లేని విద్యార్థుల సౌలభ్యం కోసం మరో గుర్తింపు పత్రాన్ని సైతం జాబితాలో చేర్చారు. ఇదివరకు 9 గుర్తింపు పత్రాలను టీకా రిజిస్ట్రేషన్ కోసం అనుమతిస్తుండగా.. తాజాగా విద్యా సంస్థ ఐడీ కార్డును సైతం టీకా రిజిస్ట్రేషన్ కోసం అనుమతించనున్నారు.
టీకాలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు?
జనవరి 3వ తేదీ నుంచి అర్హులైన టీనేజర్లకు టీకాలు వేయనున్నారు. దీనిపై డిసెంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.
పిల్లలకు ఏ కరోనా టీకాలు ఇస్తారు?
పిల్లలకు ఉపయోగపడే రెండు కరోనా టీకాలకు డీసీజీఐ అత్యవసర అనుమతులు జారీ చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకాలకు పచ్చజెండా ఊపింది. అయితే, చిన్నారుల వ్యాక్సినేషన్లో కొవాగ్జిన్ను మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. జైకోవ్ టీకాకు అనుమతులు వచ్చినప్పటికీ.. ఆ వ్యాక్సిన్ను పెద్దలకు ఇవ్వడం ప్రారంభించని నేపథ్యంలో ఒకే టీకాతో పిల్లల వ్యాక్సినేషన్ కొనసాగించనున్నట్లు సమాచారం.
వృద్ధులకు ప్రికాషన్ డోసు...
మూడో డోసు అందించే అంశంపైనా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ మాట్లాడారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, హెల్త్కేర్ సిబ్బందికి 'ప్రికాషన్' డోసును అందించనున్నట్లు తెలిపారు.