Chennai Floods Update :తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు పరిసర జిల్లాలపై మిగ్జాం తుపాను తీవ్ర ప్రభావం చూపింది. సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల నివాసాలను వరద నీరు చుట్టుముట్టింది. విద్యుత్ సరఫరా లేక చెన్నైతోపాటు శివారు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
అవస్థలు పడుతున్న చిన్నారులు!
వెలచ్చేరి, తాంబరం, ఇతర ప్రాంతాల్లో రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల ప్రజలు బుధవారం ఉదయం కూడా నడుములోతు నీటిలోనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. చిన్నారులతో అవస్థలు పడుతున్న దృశ్యాలు చాలా చోట్ల కనిపించాయి. ఇళ్లలోనే చిక్కుకుపోయిన వారికి నిత్యావసరాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
ఐటీ కారిడార్ పరిస్థితి మరింత దారుణం
నగరంలోని ఐటీ కారిడార్ పరిస్థితి దయనీయంగా మారింది. పెరుంగుడి, షోలింగనల్లూర్, తొరైపాక్కం ప్రాంతాలు నడుముల్లోతు నీళ్లల్లో నానుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తుండగా రహదారులు, నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరపాలక సిబ్బంది మోటార్ల ద్వారా వరద నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇళ్లలో చిక్కుకున్న వారు ఆహారం, నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలు కూడా అందుబాటులో లేవని వాపోతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
నగరపాలక సంస్థ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. వరద ముంపులో చిక్కుకున్న ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవలపైనే ఆహార పదార్థాలను తరలించి ఇళ్లలో చిక్కుకున్నవారికి అందిస్తున్నారు. నగరంలో 400 పడవలను సహాయ చర్యలకు ఉపయోగిస్తున్నారు.