తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 1:15 AM IST

Updated : Nov 26, 2020, 10:31 AM IST

ETV Bharat / bharat

తీరం దాటిన 'నివర్​'.. పెనుగాలుల బీభత్సం

landfall process of Cyclone Nivar
'నివర్​' తుపాను బీభత్సం

10:26 November 26

అతి తీవ్ర తుపాన్‌ నివర్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా మారింది. పుదుచ్చేరి సమీపంలో బుధవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్యలో ‘నివర్’ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 120 నుంచి 145 కి.మీ వేగంతో పెనుగాలులు వీయగా.. తర్వాత కూడా కొద్ది గంటలపాటు ప్రభావం కొనసాగింది. తుపాను ధాటికి తమిళనాడులోని చెన్నై సహా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.

బుధవారం నుంచే పుదుచ్చేరి, తమిళనాడు తీరప్రాంతాల్లో పెనుగాలులు, అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు భారీ చెట్లుకూడా నేలకొరిగాయి.అనేక చోట్ల విద్యుత్‌ స్తంబాలు కూడా పడిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడులో ముందు జాగ్రత్తగా నాగపట్నం, విల్లుపురం, కడలూరు జిల్లాలతో పాటు మరిన్ని ప్రాంతాల నుంచి 1.45 లక్షల మందిని 1500పైగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తరలించారు. చెన్నై, చెంగల్‌పేట, కడలూరుతోపాటు పుదుచ్చేరిలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో బుధవారం 16సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో 10 సెంటీమీటర్లు కురిసింది. ఇవాళ తమిళనాడులోని 16 జిల్లాల్లో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ముమ్మరంగా సహాయక చర్యలు

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 1200 వందల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఒడిశాలో మరో 20 బృందాలను సిద్ధంగా ఉంచారు. నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. చెన్నై తీరంలో కోస్టుగార్డులతోపాటు షిప్‌లను, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. పుదుచ్చేరి సర్కారు విజ్ఞప్తితో సైన్యం కూడా రంగంలోకి దిగింది.

03:32 November 26

తీరం దాటిన 'నివర్​' తుపాను

తమిళనాడు, పుదుచ్చేరిలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న 'నివర్‌' తుపాను తీరం దాటింది.  పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటక గంటకు 120-145 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు  చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. నివర్‌ తుపాన్‌ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపింది. 

02:05 November 26

తమిళనాడుకు హెచ్చరికలు

నివర్​ తుపాను తీరం దాటుతున్న క్రమంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించింది తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం. తిరువన్నమలయ్​, కదలూర్​, కల్లకురిచ్చీ, విలప్పురమ్​ జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో వచ్చే మూడు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం నివర్​ తుపాను నైరుతి బంగాళకాతంలో పుదుచ్చేరికి 25 కిలోమీటర్లు, చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 

01:09 November 26

'నివర్​' తుపాను బీభత్సం

నైరుతి బంగాళకాతంలో ఏర్పడిన నివర్​ తుపాను తీరం దాటుతూ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులోని చెన్నై, మహబలిపురంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు వీస్తున్నాయి.  తీరం దాటే క్రమంలో పెను తుపానుగా మారిన నివర్​.. కదలూర్​కు 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నట్లు తెలిపింది.  

బుధవారం ఉదయం నుంచి రాత్రి 10.30 గంటల వరకు కదలూర్​లో 227 మిల్లీ మీటర్లు, పుదుచ్చేరిలో 187, కరయ్​కల్​లో 84, చెన్నైలో 89, నాగపట్నంలో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతారవణ శాఖ వెల్లడించింది. తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుదుచ్చేరిలో 1000 మందిని శిబిరాలకు మార్చారు. 

Last Updated : Nov 26, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details