Air India disinvestment: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ను కేంద్రం వ్యతిరేకించింది. దిల్లీ హైకోర్టు ముందు వాదనలు వినిపించింది. అందరి వాదనలు విన్న జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం.. బుధవారం (జనవరి 6) ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
Air India case Delhi HC:
ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సవాలు చేస్తూ.. రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. బిడ్డింగ్ ప్రక్రియ ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, టాటాలకు అనుకూలంగా వ్యవహారం నడిపారని ఆరోపించారు. బిడ్డింగ్లో రెండో స్థానంలో నిలిచిన స్పైస్ జెట్ కన్సార్షియమ్ కూడా బ్యాంకు లావాదేవీల వ్యవహారం కేసు ఎదుర్కొంటుందని ధర్మాసనానికి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 2017లోనే ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని నిర్ణయం జరిగిందని ధర్మాసనానికి తెలిపారు. సంస్థ అధికారికంగా చేతులు మారే వరకు ఉన్న అప్పులు ప్రభుత్వం భరిస్తుందని.. ఆ తర్వాత బిడ్ దక్కించుకున్న సంస్థ భరిస్తుందని వివరించారు.
టాటా సంస్థ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కూడా వాదనలు వినిపించారు. 2017 నుంచి ఎయిర్ ఇండియాను అమ్మడానికి ప్రభుత్వం కష్టపడుతోందని తెలిపారు. ఎయిర్ లైన్స్ వ్యాపారం కఠినంగా ఉంటుందని.. లావాదేవీలు అన్నీ పెద్దవే అయినా అనుకున్న విధంగా డబ్బు అందుతుందో లేదో అని భయం నెలకొంటుందని న్యాయమూర్తికి చెప్పారు. అవినీతి ఆరోపణలపై సుబ్రహ్మణ్య స్వామి ఎలాంటి ఆధారాలు చూపలేదని అన్నారు.
ఇదీ చదవండి:Air India News: సొంతింటికి ఎయిరిండియా!