తెలంగాణ

telangana

నీతీశ్​ బలపరీక్ష రోజే, ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు

By

Published : Aug 24, 2022, 11:15 AM IST

బిహార్‌లో మహా గట్‌బంధన్‌ సర్కారు బలపరీక్ష రోజే పలువురు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ సహా పలువురి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది. ఐటీ, ఈడీ, సీబీఐ ఈ మూడు భాజపా కిందే పనిచేస్తాయని, వారి ఆఫీసులను కూడా ఆ పార్టీ స్క్రిప్టే నడిపిస్తుందని ఆర్జేడీ నాయకులు మండిపడుతున్నారు. అయితే సీఎం నీతీశ్​ కుమార్​ ఫిర్యాదు మేరకే సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్ అన్నారు.

cbi-raids-residence-of-rjd-mlc-sunil-singh-in-patna
cbi-raids-residence-of-rjd-mlc-sunil-singh-in-patna

CBI Raids In Patna: బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ మహా గట్‌బంధన్‌ సర్కారు బలపరీక్ష రోజు.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన 'ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌' కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ ఇంటి వద్ద సీబీఐ అధికారులు

CBI Raids RJD MLC Sunil Singh: ఈ తనిఖీలపై సింగ్‌ స్పందిస్తూ.."ఇప్పటికే ఒక సారి తనిఖీలు చేశారు. మళ్లీ చేయడంలో అర్థం లేదు. భయభ్రాంతులను సృష్టించి ఎమ్మెల్యేలను వారికి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఇదే కుంభకోణానికి సంబంధించి ఆర్జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్ఫాక్‌ కరీం ఇంటిపై కూడా సీబీఐ నేడు దాడులు నిర్వహించింది. ఈ దాడులపై ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా స్పందిస్తూ "ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు.. భాజపా దాడులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి భాజపా కిందే పనిచేస్తాయి. వారి ఆఫీసులను కూడా ఆ పార్టీ స్క్రిప్టే నడిపిస్తుంది. నేడు బిహార్‌ అసెంబ్లీలో బల పరీక్ష ఉంది.. అదే సమయంలో ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు" అని పేర్కొన్నారు.

సునీల్‌ సింగ్‌ ఇంటి వద్ద బలగాలు

అయితే సీబీఐ దాడులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్​ స్పందించారు. అప్పట్లో ల్యాండ్​ ఫర్​ జాబ్స్​ కుంభకోణంపై సీఎం నీతీశ్​ కుమార్​ స్వయంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. బహుశా దాడులు అందులో భాగమేనని అన్నారు.

సునీల్‌ సింగ్‌ ఇంటి వద్ద గుమిగూడిన కార్యకర్తలు

భూములను లంచంగా తీసుకున్న ఆరోపణలపై సీబీఐ.. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. 2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పని చేశారు. రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం 2009లో జరిగిన రిక్రూట్‌మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్‌-డి ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతీతో పాటు ఉద్యోగాలు పొందిన పలువురిని సీబీఐ నిందితులుగా చేర్చింది.

అంతకుముందు రోజు, మంగళవారం బిహార్ శాసన సభ స్పీకర్​ విజయ్​ కుమార్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతున్నారని రాజీనామా చేస్తే, తన ఆత్మ గౌరవం దెబ్బతింటుందని అన్నారు. తనపై అసత్య ఆరోపణలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. శాసన సభ నియమావళిని పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఈ అవిశ్వాస తీర్మానంలో అసెంబ్లీ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. తాను పక్షపాత ధోరణితో, నియంతలా వ్యవహరిస్తున్నాని అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేస్తే తన ఆత్మగౌరవం దెబ్బతింటుందని సిన్హా పేర్కొన్నారు.

మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. భాజపాకు చెందిన ప్రస్తుత విధాన సభ స్పీకర్​ విజయ్​ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా చేయలేదు. దీంతో 55 మంది ఎమ్మెల్యేలు కలిగిన మహాకూటమి స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. సాధారణంగా ప్రభుత్వం మారితే మొదట ఎన్నికైన స్పీకర్​ రాజీనామా చేస్తారు. బిహార్ శాసనసభ ప్రత్యేక సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజే స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవట్లేదని గడ్కరీ విమర్శలు

ఉచితాలపై భాజపా సహా అన్ని పార్టీలూ ఒకేవైపు, అందుకే మేమే తేలుస్తాం

ABOUT THE AUTHOR

...view details