పశ్చిమ బంగాల్లోని బీర్భుమ్ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తన నివేదికను ఏప్రిల్ 7లోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పేపర్లను, నిందితులను అప్పగించాలని బంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు ఆదేశాలు జారీ చేసింది. బీర్భుమ్ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు ఈ మేరకు విచారణ జరిపింది. ఏప్రిల్ 7న తదుపరి విచారణ జరపనుంది.
ఇదీ జరిగింది
బంగాల్, రాంపుర్హట్ ప్రాంతంలో కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. "తృణమూల్ కాంగ్రెస్ నేత, బర్షాల్ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్ బహదూర్ షేక్ను ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్హట్లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. . హత్యకు ముందు బాధితులను తీవ్రంగా కొట్టి అనంతరం సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేయగా.. నిర్లక్ష్యం వ్యవహరించిన పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి:ఫోన్ పగులకొట్టాడని.. కూలీని హత్య చేసిన యువకుడు..