తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2022, 5:35 PM IST

Updated : Jan 7, 2022, 9:33 PM IST

ETV Bharat / bharat

'మోదీ టూర్​లో భద్రతా వైఫల్యం'పై దర్యాప్తు- కేంద్రం షోకాజ్​ నోటీసులు

Breach in PM Modis security: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ.. దర్యాప్తు షురూ చేసింది. ఫ్లైఓవర్​పై మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన ప్రాంతాన్ని పరిశీలించింది. పంజాబ్​ డీజీపీ సహా మొత్తం 10 మందికిపైగా రాష్ట్ర పోలీస్​ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఆరుగురు ఐపీఎస్​ అధికారులకు కేంద్ర హోంశాఖ షోకాజ్​ నోటీసులు పంపింది.

Breach in PM Modi's security
Breach in PM Modi's security

Breach in PM Modis security: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా ప్యానెల్.. శుక్రవారమే దర్యాప్తును ప్రారంభించింది​. రాష్ట్రంలో పర్యటించిన కమిటీ.. పంజాబ్​ డీజీపీ సిద్ధార్థ్​ ఛటోపాధ్యాయ సహా మొత్తం 10 మందికిపైగా పోలీస్​ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది.

  • ఫిరోజ్​పుర్​- మోగా హైవే ఫ్లైఓవర్​పై ప్రధాని కాన్వాయ్​ నిలిచిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు కమిటీ సభ్యులు.
    మోదీ కాన్వాయ్​ నిలిచిపోయిన ప్రదేశంలో కేంద్ర కమిటీ సభ్యులు
  • సుమారు కిలోమీటర్​ దూరం నడిచి.. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
    ఫిరోజ్​పుర్​- మోగా హైవే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ బృందం
  • గంటసేపటి తర్వాత సమీపంలోని ఫిరోజ్​పుర్​ బీఎస్​ఎఫ్​ కార్యాలయానికి చేరుకొని.. అక్కడి అధికారులతో మోదీ భద్రతా లోపం ఘటనపై చర్చించారు.
  • పంజాబ్​ పర్యటనలో బుధవారం.. ప్రధాని వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకుని అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు.
  • ఆ వెంటనే పోలీసులకు సమన్లు జారీ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆ మార్గం క్లియరెన్స్​ బాధ్యతలు చూసినవారిలో డీజీపీ, ఎస్​ఎస్​పీలపై ప్రశ్నల సంధించి.. అన్ని విధాలా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
    కేబినెట్ సెక్రెటేరియట్ కార్యదర్శి సుధీర్ కుమార్ సక్సేనా ఈ కేంద్ర కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్​పీజీ) ఐజీ ఎస్ సురేశ్​లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా నివేదిక అందించాలని హోంశాఖ ఈ కమిటీని ఆదేశించింది.

పోలీసులపై చర్యలు!

స్పెషల్​ ప్రొటెక్షన్​ గ్రూప్​(ఎస్​పీజీ) చట్టం కింద.. పంజాబ్​ పోలీస్​ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

ఎస్​పీజీ చట్టంలోని సెక్షన్ 14.. ప్రధానమంత్రి ఎటైనా వెళ్లిన సమయంలో ఎస్​పీజీకి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకారం, సమన్వయం సహా అన్నింటికీ బాధ్యత వహించాలని చెబుతోంది.

కేంద్ర హోంశాఖ షోకాజ్​ నోటీసులు..

పంజాబ్​కు చెందిన ఆరుగురు ఐపీఎస్​ అధికారులకు కేంద్ర హోంశాఖ షోకాజ్​ నోటీసులు పంపింది. వీరిలో భఠిండా ఎస్పీ అజయ్​ మలుజా సహా ప్రధాని పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న రాష్ట్రస్థాయి పోలీస్​ అధికారులు ఉన్నారు.

మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.

ఆల్​ ఇండియా సర్వీసెస్​ నిబంధన-1969 ప్రకారం వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని అధికారులను ప్రశ్నించింది. అయితే అధికారులు ఇచ్చే వివరణ ఆధారంగా వారిపై హోం శాఖ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సుప్రీంలో విచారణ..

జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్​ పర్యటనకు సంబంధించిన ప్రయాణ వివరాలు, ఏర్పాట్ల సమాచారాన్ని వెంటనే భద్రపరచాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది సుప్రీం కోర్టు. మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై.. దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.

దర్యాప్తు కోసం కేంద్రం, పంజాబ్‌ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు భద్రతా లోపంపై విచారణను సోమవారం వరకు నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. రికార్డులు సేకరించేందుకు దర్యాప్తు సంస్థలు, పోలీసులు సహకరించాలని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:'మోదీ పంజాబ్ ఘటన'పైనే కేబినెట్ చర్చ.. విచారణకు త్రిసభ్య కమిటీ

Last Updated : Jan 7, 2022, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details