బంగాల్ తొలి విడత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడం పట్ల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్ శాతం, ముందస్తు సరళిని బట్టి బంగాల్లో భాజపా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.
ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. అసోంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్ల వల్ల భారీ సంఖ్యలో ప్రజలు ఓటేసేందుకు తరలి వచ్చారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా బంగాల్ అధికార పార్టీ టీఎంసీపై విమర్శలు గుప్పించారు.
"బంగాల్ ఎన్నికల తొలి విడతలో అధిక ఓటింగ్ శాతం నమోదు కావడాన్ని చూస్తే.. ప్రతి దశలోనూ భాజపా గొప్ప విజయం సాధిస్తుందని స్పష్టమవుతోంది. ఈ సరళిని గమనిస్తే భాజపా స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. ఓటింగ్ శాతంలో పెరుగుదలను గమనిస్తే భాజపా చక్కగా పోరాడిందని అర్థమవుతోంది. ఇదివరకు టీఎంసీ విధ్వంస పాలన మాత్రమే ఉండేది. ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్ల వల్ల ప్రజలు బయటకు వచ్చి ఓటేశారు."
-రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి
అసోంలో భాజపా పనితీరుకు ఎలాంటి ఢోకా లేదని.. అభివృద్ధి, సుపరిపాలనలో తమ పార్టీకి మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో భాజపాకు సీట్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.