త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపా పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలోనే రాష్ట్రపతి అభ్యర్తిపై ఉత్కంఠకు తెరదించే అవకాశముంది. నేడు యోగా దినోత్సవం (జూన్ 21) దృష్ట్యా మైసూర్లో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని మైసూర్ నుంచి వచ్చాక పార్లమెంటరీ బోర్డు భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 5 రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. అధికార పక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం భాజపా కమిటీ వేసింది. జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. అయితే విపక్షాలతో చర్చింది ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ఈ కమిటీకి భాజపా అధిష్టానం సూచించింది. దీంతో పలువురు ప్రతిపక్ష నేతలతో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంప్రదింపులు జరిపారు. మరోవైపు అభ్యర్థి ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం విపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29న చివరి తేదీ.
తెరపైకి యశ్వంస్ సిన్హా: రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు తాజాగా తెరపైకి వచ్చింది. రాష్ట్రపతిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాన్ని మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్పవార్, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఈ పదవికి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో నేత కూడా ముందుకురాని తరుణంలో ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మంగళవారం ప్రధాన విపక్షాలతో శరద్ పవార్ నిర్వహిస్తున్న ఒక సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉంది.
వ్యూహాత్మక ఎంపిక:సిన్హా గత ఏడాది భాజపా నుంచి బయటకు వచ్చి తృణమూల్లో చేరారు. ఆయనకు ఇప్పటికే కొన్ని పార్టీలు మద్దతు పలికాయనీ, 85 ఏళ్ల సిన్హా అభ్యర్థిత్వంపై తృణమూల్ ఛైర్పర్సన్ మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. వాజ్పేయీ హయాంలో, మోదీ నేతృత్వంలో పాలన ఎలా మారిందో తేడా చెప్పే క్రమంలో సిన్హా పేరును తెరపైకి వ్యూహాత్మకంగా తెచ్చినట్లు చెబుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన సిన్హా 1984లో జనతాదళ్లో చేరారు. తర్వాత భాజపాలో చేరారు. ప్రస్తుతం తృణమూల్ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.