తమ పార్టీని వీడి భాజపాలో చేరిన వారు 'నమ్మకద్రోహుల'ని బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కానీ, వారి వల్ల ఇప్పుడు భాజపాలోని సీనియర్ నేతలు బాధపడుతున్నారని అన్నారు. సొంత పార్టీని నమ్ముకున్నవారిని కాదని... ఫిరాయింపుదారులను భాజపా రంగంలోకి దించుతోందని ఎద్దేవా చేశారు.
తూర్పు మెదినీపుర్లోని ఎగ్రాలో ఎన్నికల ప్రచారం చేశారు మమత. విద్వేషపూరిత రాజకీయాలను భాజపా ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బయటి వ్యక్తుల నుంచి కాపాడుకునేందుకు తమకు సాయపడాలని ప్రజలను కోరారు.
"నమ్మకద్రోహులు ఇప్పుడు భాజపా అభ్యర్థులు అయ్యారు. ఈ ఫిరాయింపుదారులకు గతంలో ఎన్నో బాధ్యతలు ఇచ్చాం. సంక్షేమ ఫలాలన్నీ ఇప్పుడు ప్రజలకు చేరేలా నేను పర్యవేక్షిస్తున్నాను. దేవుడు పేరు చెప్పి, భాజపా వెన్నుపోటు పొడుస్తోంది. పాన్పరాగ్ నమిలి ప్రజల నుదటిపై తిలకం పెడుతోంది. భాజపాకు ఓటు వేయకండి."