రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశ ప్రకటనతో తమిళనాడు రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరుకున్నాయి. రజనీ ప్రకటనతో పాటు అధికార అన్నాడీఎంకే పార్టీకీ మరో వార్త.. తలనొప్పిగా మారింది. అన్నాడీఎంకే పార్టీతో పొత్తు విషయంలో భాజపా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ శుక్రవారం పేర్కొనడం చర్చనీయాంశమైంది.
'అన్నాడీఎంకేతో పొత్తుపై ఏ విషయం ఖరారు కాలేదు. దీనిపై నిర్ణయాధికారం జాతీయ నాయకత్వానిదే' అంటూ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మురుగన్ శుక్రవారం పేర్కొన్నారు. రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకొనే విషయంపైనా సానుకూలంగానే స్పందించారు.
'ఎన్డీఏదే అధికారం'
2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. భాజపా సైతం ఇదే తరహాలో ఆలోచిస్తోంది. రజనీ రాజకీయ ప్రవేశం తమకు లాభించేదే అని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై పునరాలోచనలో పడింది. రాష్ట్రంలో ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే భాజపా చేస్తున్న ప్రకటనలు అన్నాడీఎంకేకు రుచించడం లేదు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని తమిళనాడులో పోటీ చేసింది భాజపా. అయితే ఇందులో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒక్క సీటు దక్కించుకోవడంలోనూ విఫలమైంది. ఓట్లు కూడా రెండు శాతానికి అటు ఇటుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తుపై భాజపా యూ-టర్న్ తీసుకోవడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
అప్పుడు సానుకూలమే
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలలో తమిళనాడులో పర్యటించినప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు ఖరారైనట్లేనని అందరూ భావించారు. కూటమి విషయంలో అమిత్ షా సానుకూలంగానే వ్యవహరించారు. విపక్ష డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కలిసికట్టుగానే పోటీ చేస్తామని పళనిస్వామి, పన్నీర్సెల్వం సైతం ప్రకటించారు.