Goa Assembly polls: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్కు షాక్ ఇచ్చింది భాజపా. తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు. గురువారం మొత్తం 40 సీట్లకు గాను 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన భాజపా.. ఉత్పల్కు టికెట్ ఇవ్వకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఉత్పల్ పారికర్కు టికెట్ ఇవ్వకపోవటంపై విలేకరులు ప్రశ్నించగా సమాధానం ఇచ్చారు భాజపా గోవా రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ దేవేంద్ర ఫడణవీస్.
" పారికర్ కుటుంబం ఎల్లప్పుడూ మన కుటుంబమే. కానీ, ఉత్పల్ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో ఇప్పటికే భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టటం సరైనది కాదు. ఉత్పల్కు పోటీ చేసేందుకు మరో రెండు స్థానాలను సూచించాం. దానిని ఆయన తిరస్కరించారు. ఉత్పల్తో చర్చలు కొనసాగుతున్నాయి. పార్టీ నిర్ణయానికి అంగీకరిస్తారనే నమ్మకం ఉంది. "
- దేవేంద్ర ఫడణవీస్, భాజబా ఎన్నికల ఇంఛార్జ్.
ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు పారికర్ కుటుంబ సన్నిహిత వర్గాల్లో ఒకరు. తన తండ్రి ఎమ్మెల్యేగా చేసిన స్థానంలో పోటీ చేయాలని ఉత్పల్ పారికర్ సెంటిమెంట్గా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు ఉత్పల్ను ఒప్పించి.. భాజపా ఆఫర్ చేస్తున్న ఇతర స్థానాల్లో పోటీ చేయాలని చెప్పినా అలా చేయరని పేర్కొన్నారు.
మరోవైపు.. గత నెల రోజులకుపైగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దేవేంద్ర ఫడణవీస్.. ఉత్పల్తో మాట్లాడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరో స్థానంలో పోటీ చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేసినా ఉత్పల్ నుంచి స్పందన లేదని పేర్కొన్నాయి. ' ఉత్పల్తో మాట్లాడాం. ఆయన రాజకీయ భవిష్యత్తు సరిగ్గా ఉండాలంటే పార్టీ చెప్పిన స్థానంలో పోటీ చేయాలని సూచించాం. ఆయన విజయం సాధించే స్థానాన్నే పార్టీ ఆఫర్ చేసింది. ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకున్నా.. ఆయన పార్టీలోనే కొనసాగుతారు.' అని భాజపా వర్గాలు తెలిపాయి.
కేజ్రీవాల్ ఆఫర్..