Birbhum Killings: బంగాల్లో బీర్భుమ్ సజీవ దహనాల ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్పై.. భాజపా, కాంగ్రెస్ మాటలతో విరుచుకుపడుతున్నాయి. ఈ ఘటన మొత్తం నాజీ నిర్బంధ శిబిరాన్ని తలపిస్తోందని, బంగాల్ సీఎం మమతా బెనర్జీ క్రూరంగా కనిపిస్తున్నారని భాజపా ఆరోపించింది. రాష్ట్రంలో మానవత్వం మట్టిలో కలిసిందని విమర్శించిన భాజపా ప్రతినిధి సంబిత్ పాత్రా.. బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో మాటలయుద్ధం: బంగాల్ ఘటనపై పార్లమెంట్లో హోరాహోరీ వాదనలు నడిచాయి. తృణమూల్ కాంగ్రెస్ బృందం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి బంగాల్ గవర్నర్ను తొలగించాలని కోరింది. ఆయన రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆరోపించింది. అంతకుముందు లోక్సభలో భాజపా ఎంపీ సౌమిత్రా ఖాన్ వెల్లోకి దూసుకెళ్లారు. బంగాల్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను ఘటనా స్థలానికి అనుమతించట్లేదని గౌరవ్ గొగొయి విమర్శించారు.
బీర్భుమ్ ఘటనను తీవ్రంగా పరిగణించిన బంగాల్ ప్రభుత్వం 10 రోజుల స్పెషల్ క్లీన్-అప్ డ్రైవ్కు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల వద్ద అక్రమంగా ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వెలికితీయాలని స్పష్టం చేసింది. రాంపుర్హట్-1 బ్లాక్ తృణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనారుల్ హొస్సేన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బోగ్తుయీ గ్రామంలో ప్రజల భయాందోళనను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను పట్టుకోవాలని సీఎం ఆదేశించిన గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. హొస్సేన్ నివాసం సహా జిల్లాలోని పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఘటనకు సంబంధించి ఆయనను ప్రశ్నించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్లక్ష్యంగా ఉన్నందుకు.. రాంపుర్హట్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ త్రిదిబ్ ప్రామాణిక్ను సస్పెండ్ చేశారు అధికారులు.
దోషుల్ని శిక్షిస్తాం:నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. లొంగిపోకుంటే వేటాడి పట్టుకుంటామని హెచ్చరించారు. బోగ్తుయీలో సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించిన దీదీ.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించారు. ధ్వంసమైన ఇళ్లను పునఃనిర్మించుకునేందుకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం ఇచ్చారు.