తెలంగాణ

telangana

భీకర వర్షాలు.. 130 కి.మీ వేగంతో బలమైన గాలులు.. అనేక ప్రాంతాల్లో కరెంట్ కట్​.. తీరాన్ని దాటిన బిపోర్‌జాయ్

Cyclone Biporjoy Landfall : బిపోర్‌జాయ్ అతి తీవ్ర తుపాను గుజరాత్‌ కచ్ ప్రాంతంలోని కోట్‌ లఖ్‌పుత్‌ సమీపంలో తీరాన్ని దాటింది. తుపాన్ ప్రభావంతో.. తీరప్రాంతాల్లోని 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీశాయి. కచ్‌, సౌరాష్ట్ర, రాజ్‌కోట్‌, జామ్‌నగర్, ఆమ్రేలీ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. భావ్‌నగర్‌ జిల్లాలో వరద నీటి నుంచి మేకలను కాపాడే ప్రయత్నంలో తండ్రి-తనయుడు ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Jun 16, 2023, 6:40 AM IST

Published : Jun 16, 2023, 6:40 AM IST

Updated : Jun 16, 2023, 8:45 AM IST

biporjoy cyclone landfall
తీరం దాటిన బిపోర్‌జాయ్

Biporjoy Cyclone Gujarat : బిపోర్‌జాయ్ అతి తీవ్ర తుపాను.. గుజరాత్ కచ్‌ ప్రాంతంలోని కోట్‌ లఖ్‌పత్‌ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని దాటింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పట్టిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కచ్‌ సమీపంలోని జఖౌ వద్ద సాయంత్రానికే పెనుతుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. తుపాను వేగం తగ్గటం వల్ల తీరాన్ని తాకడానికే ఆలస్యమైంది. బిపోర్‌జాయ్ తుపాను కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉందని చెప్పారు. మునుపటి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 48 గంటల్లోనే.. ఈ తుపాను తీవ్రరూపం దాల్చింది. అరేబియాలో పది రోజులకుపైగా కొనసాగిన తొలి తుపానుగా ఇది నిలిచిపోనుంది.

తుపాను ప్రభావంతో కచ్, జామ్‌నగర్‌, రాజ్‌కోట్, పోర్‌బందర్, దేవ్‌భూమి ద్వారక, ఆమ్రేలీ సహా పలు ప్రాంతాల్లో... భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలతోపాటు దమణ్‌ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భీకర గాలుల కారణంగా కచ్‌ జిల్లాలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భావ్‌నగర్ జిల్లాలో.. వరద నీటి నుంచి తమ మేకలను కాపాడే ప్రయత్నంలో తండ్రి-తనయుడు ప్రాణాలు కోల్పోయారు. తుపాను తీరం దాటిన పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 20 తీరప్రాంత గ్రామాలకు చెందిన లక్ష మంది ప్రజలను.. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ద్వారకలోని సుప్రసిద్ధ ప్రాచీన ఆలయం సహా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. 18 NDRF, 12 SDRF బృందాలతో పాటు.. రహదారులు-భవనాలు, విద్యుత్ శాఖలకు చెందిన బృందాలను.. సహాయక చర్యల్లో మోహరించారు. తుపాను కారణంగా రైల్వేశాఖ 76 రైళ్లను రద్దు చేసింది.

తుపాను కారణంగా చోటుచేసుకున్న పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. రాత్రి గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్‌ చేసిన మోదీ సహాయ, పునరావాస చర్యలపై చర్చించారు. గిర్‌ అడవుల్లో సింహాలు ఇతర జంతువుల రక్షణకు చేపట్టిన చర్యలపైనా వాకబు చేశారని సీఎం ట్వీట్‌ చేశారు. దెబ్బతిన్న విద్యుత్‌ లైన్లు సాగునీటి వనరులు, రోడ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వన్యప్రాణులను కాపాడేందుకు అటవీశాఖ 184 ర్యాపిడ్‌ యాక్షన్‌ స్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

పాకిస్థాన్‌పైనా బిపోర్‌జాయ్ తుపాను ప్రభావం పడింది. తుపాన్ తీవ్రత దృష్ట్యా తీర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. దాదాపు 82 వేల మందిని.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.పాక్‌లో దాదాపు 325 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంపై తుపాను ప్రభావం పడుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. విద్యుత్, సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందనే అంచనాతో ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.

Last Updated : Jun 16, 2023, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details