దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషుల విడుదలపై సుప్రీంకోర్టులో గుజరాత్ సర్కార్ దాఖలుచేసిన అఫిడవిట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులోని 11మంది దోషులు 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపారని.. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించినట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై నిర్ణయం తీసుకునే ముందు 1992 నాటి రెమిషన్ పాలసీ కింద అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. కేవలం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా దోషులను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. అఫిడవిట్ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం దీనిపై నవంబరు 29న విచారణ జరపనున్నట్లు తెలిపింది.
అయితే దోషుల విడుదలను సీబీఐతోపాటు ముంబయిలోని ప్రత్యేక కోర్టు వ్యతిరేకించినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని సమాచారం. అంతేకాకుండా దోషులకు రెమిషన్ మంజూరు కోసం చేసిన ప్రతిపాదనలను గుజరాత్ సర్కారు కేంద్ర హోంశాఖకు పంపగా.. కేవలం 2 వారాల్లోనే అనుమతులు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక రెమిషన్కు ముందు కూడా దోషులు అనేక సార్లు పెరోల్పై జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తోంది. దాదాపు వెయ్యి రోజులకు పైనే వారికి పెరోల్ లభించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దోషులు పెరోల్పై జైలు నుంచి విడుదలైనప్పుడు తనను వేధించారని బాధితురాలు బిల్కిస్బానో గతంలోనేఆరోపించారు. అలాంటి వారిని సత్ప్రవర్తన కారణంగా ఎలా విడుదల చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.