బిహార్ పట్నాలో 63 ఏళ్ల ఓ మహిళకు ఒకేరోజు 15 నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు టీకా డోసులు వేశారు వైద్య సిబ్బంది. మొదట కొవిషీల్డ్ టీకా డోసు అందించిన సిబ్బంది.. పావుగంట వ్యవధిలో కొవాగ్జిన్ డోసు వేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పిన అధికారులు.. ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
కరోనా టీకా తీసుకునేందుకు సంగీత దేవి అనే మహిళ.. పట్నాలోని పున్పున్ బ్లాక్ పరిధిలోని బెల్దారిచాక్ మీడియం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లింది. ఆధార్ కార్డు, ఫోన్ నంబరు సమర్పించింది. తర్వాత ఒకటో నంబరు టెబుల్ వద్ద ఉన్న సిబ్బంది మొదట డోసు వేశారు. తర్వాత మరో టెబుల్ వద్దకు వెళ్లాలని చెప్పారు. అక్కడ 15నిమిషాల తర్వాత వరుస నిల్చోమని చెప్పారు. ఆ సమయంలో ఒకేచేతికి రెండు డోసులు ఇస్తారా అని సిబ్బందిని సంగీత అడిగారు. దానికి అవును అని సమాధాం చెప్పారు. దీంతో రెండో టీకా వేసుకున్నారు సంగీత. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి, ఆందోళనకు దిగారు. ఇదంతా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. దీంతో ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.