తెలంగాణ

telangana

'రాష్ట్రాన్ని పాలిస్తారా లేక భోజనం తయారుచేస్తారా?'

By

Published : Oct 13, 2019, 7:11 AM IST

Updated : Oct 13, 2019, 10:05 AM IST

మహారాష్ట్ర ఎన్నికల వేళ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. శివసేన మ్యానిఫెస్టోలో ప్రకటించిన రూ.10కే భోజనం హామీపై శరద్​ పవార్​ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తారా లేక భోజనం తయారుచేస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యకు పవార్​ ప్రవేశపెట్టిన విధానాలే కారణమని మండిపడ్డారు ముఖ్యమంత్రి ఫడణవీస్​.

'రాష్ట్రాన్ని పాలిస్తారా లేక భోజనం తయారుచేస్తారా?'

'రాష్ట్రాన్ని పాలిస్తారా లేక భోజనం తయారుచేస్తారా?'

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మరాయి. పోలింగ్​ దగ్గర పడుతున్న కొద్ది అగ్రనేతల ప్రచారాలు జోరందుకుంటున్నాయి. వాటికి తగ్గట్టుగానే అగ్రనేతల ర్యాలీల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా అధికార భాజపా.. దాని మిత్రపక్షమైన శివసేనపై సోలాపూర్​ జిల్లాలోని బర్షాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తీవ్ర విమర్శలు చేశారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ) అధ్యక్షుడు శరద్​ పవార్​.

పేదలకు 10 రూపాయలకే పూర్తి భోజనం అందిస్తామని శివసేన తన మానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవార్​. ఇదే శివసేన గతంలో 'జున్​కా- భాకర్​' కేంద్రాలను ప్రారంభించిందని.. ఇప్పుడు అవి ఎక్కడా కనపడటం లేవని ఎద్దేవా చేశారు.

"1990లో తొలిసారి శివసేన-భాజపా కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. సబ్సిడీ ధరలతో జున్​కా-భాకర్​ను అమ్మడానికి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి ఎప్పుడు కనుమరుగయ్యయో.. శివసేన కార్యకర్తలు ఈ స్థలాలను ఎప్పుడు ఆక్రమించారో ఎవరికి గుర్తులేదు. ఇక ఇప్పుడు 10 రూపాయలకు భోజన పథకం అంటున్నారు. ప్రజలు మిమ్మల్ని రాష్ట్రాన్ని నడిపించమంటున్నారా? లేక భోజనాన్ని తయారు చేయమంటున్నారా?"
--- శరద్​పవార్​, ఎన్​సీపీ అధ్యక్షుడు.

'ఎన్ని ప్రశ్నలున్నా.. ఆర్టికల్​ 370 రద్దు ఒక్కటే సమాధానం'

ఎన్నికల్లో ప్రతిపక్షం అసలు పోటీ ఇవ్వలేకపోతోందన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ విమర్శలపై మండిపడ్డారు పవార్​. ప్రతిపక్షం పోటీ ఇవ్వలేకపోతుంటే.. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 9 ర్యాలీలు, అమిత్​ షా 20 బహిరంగ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

నిరుద్యోగం, మహిళల భద్రత, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై అమిత్​ షాను ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు.. ఆర్టికల్​ 370 రద్దు ఒక్కటే సమాధానంగా చెబుతున్నారని ఆరోపించారు ఎన్​సీపీ అధ్యక్షుడు. షా ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టికల్​ 370 రద్దు గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

'రైతుల ఆత్మహత్య పాపం పవారదే..'

మహారాష్ట్రలో రైతుల అత్మహత్యకు ఎన్​సీపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్​ పవార్ ప్రవేశపెట్టిన​ విధానాలే కారణమని ఆరోపించారు ఫడణవీస్​. అకోలా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. అన్నదాతల ఆత్మహత్య పాపం పవార్​దేనని వ్యాఖ్యానించారు.

శరద్​పవార్​పై భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. కళ్ల ముందు ఓటమి కనపడుతుండటం వల్లే పవార్​ నిగ్రహం కోల్పోయి భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఔరంగాబాద్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష నేతలు జైళ్లు-ఈడీ కార్యాలయాల మధ్యే పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:- 'మహా'గడ్డపై మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం

Last Updated : Oct 13, 2019, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details