తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరసత్వ చట్ట సవరణ నిర్ణయం సరైనదే: గడ్కరీ

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ముస్లింలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈశాన్యంలో రాజుకున్న అగ్గికి కాంగ్రెస్ వాయువు జతచేస్తోందని విమర్శించారు గడ్కరీ. ఎవరినీ పాకిస్థాన్ వెళ్లాలని అడగబోమన్నారు.

By

Published : Dec 15, 2019, 5:30 AM IST

Updated : Dec 15, 2019, 7:10 AM IST

Nitin Gadkari
పాకిస్థాన్​ వెళ్లమని ఎవరినీ అడగట్లేదు:'పౌర' చట్టంపై గడ్కరీ

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. పలు కీలక విషయాలపై మాట్లాడారు.

నూతన పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది కాదని వివరణ ఇచ్చారు గడ్కరీ. పాకిస్థాన్ వెళ్లాలని ఎవరినీ అడగబోమన్నారు. ఈ విషయంలో ప్రజల్ని కాంగ్రెస్​ తప్పదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈశాన్యంలో రాజుకున్న అగ్గికి ఆ పార్టీ​ వాయువును జోడిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి.

'కాంగ్రెస్ సహజగుణం'

ప్రజల భయాలతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ సహజగుణం అని తీవ్ర విమర్శలు చేశారు గడ్కరీ. నూతన పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సరైనదేనని..ఇది ఎవరి హక్కులకు భంగం కల్గించబోదని గడ్కరీ అన్నారు. ఈ చట్టం దేశ సంక్షేమం కోసమేనని.. రాజకీయాలకు తావులేదన్నారు గడ్కరీ.

"ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పిస్తాం. మేం ముస్లింలకు వ్యతిరేకం కాదు. వాళ్లని పాకిస్థాన్ వెళ్లాలని అడగడం లేదు. ఈ విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు."

-నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి.

ఝార్ఖండ్​లో విజయంపై విశ్వాసం

ఝార్ఖండ్​లో మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు గడ్కరీ. ఆ రాష్ట్రంలో అభివృద్ధికి తమ పార్టీదే బాధ్యతన్నారు. సీఎం రఘుబర్​దాస్ పనితీరును కొనియాడారు. బిహార్​ నుంచి విడిపోయినపుడు ఝార్ఖండ్​ పరిస్థితి బాగాలేదని... ప్రస్తుం బిహార్​ కన్నా ముందువరుసలో ఉందని చెప్పారు గడ్కరీ.

హరియాణా, మహారాష్ట్రలో పరిస్థితులు వేరని.. ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గడ్కరీ.

మహా రాజకీయాలపై స్పందన..

మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి స్పందన కోరగా.. శివసేన ఇక నుంచి నిజాయతీ పార్టీ కాదని బదులిచ్చారు గడ్కరీ.

" ప్రస్తుత శివసేన.. బాలాసాహెబ్​ నాటి శివసేన కాదు. పౌరసత్వ సవరణ బిల్లును ఆ పార్టీ లోక్​ సభలో మద్దతిచ్చింది. రాజ్యసభలో వ్యతిరేకించి. నిజాయతీ గల పార్టీ అయితే ఇలా చేయదు."

-గడ్కరీ.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యహరించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా మహారాష్ట్రలో ఎందుకు చేయలేకపోయారని ఈటీవీ భారత్​ ప్రశ్నించగా.. తాను పార్టీలో ఓ సభ్యుడిని మాత్రమేనని బదులిచ్చారు. అధిష్ఠానం సూచనల మేరకు నడుకుంటానన్నారు. మహా రాజకీయాల్లో తన జోక్యాన్ని పార్టీ కోరలేదని వివరణ ఇచ్చారు గడ్కరీ.

రాహుల్​ గాంధీపై మండిపాటు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ చేసిన 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై మండిపడ్డారు గడ్కరీ. అలా అనడం దురదృష్టకరమన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.

మిత్ర పార్టీలపై స్పష్టత..

భాజపా- శివసేనలది సహజ బంధమని.. మహారాష్ట్రలో అధికారం కోసం ఆ పార్టీ తెగదెంపులు చేసుకుందని గడ్కరీ చెప్పారు.

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపిందన్నారు గడ్కరీ. ఆ పార్టీతో చిన్న చిన్న విభేదాలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. అవసరమైతే ఝార్ఖండ్​లోనూ జేడీయూ మద్దతు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: స్వామియే శరణం... ఆలయ ఆదాయం 100కోట్లు!

Last Updated : Dec 15, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details