అత్త-కోడళ్ల మధ్య ఎప్పుడూ వైరమే ఉంటుంది అని చాలా సందర్భాల్లో వింటుంటాం. కానీ, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన ఓ కుటుంబంలో ఇలాంటి మాటలకు చోటులేదు. 39 మంది కలిసి జీవిస్తున్న ఈ ఉమ్మడి కుటుంబంలో ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ. ఇంట్లో ఉన్న 11 మంది కోడళ్లకు అత్తంటే విపరీతమైన అభిమానం. అందుకే ఆమె జ్ఞాపకార్థంగా ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేశారు. ఆమె కోసం ప్రతి నెలా పూజలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.
అత్తే దైవమై....
రతన్పూర్కు చెందిన శివప్రసాద్ తంబోలి విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన భార్య గీతా దేవి. ఈ దంపతులకు ముగ్గురు తనయులు ఉన్నారు. అయితే శివప్రసాద్ సోదరులు, వారి జీవితభాగస్వాములు, ఇతరులు కలిపి... మొత్తంగా 39 మంది ఉన్న ఉమ్మడి కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తుండేవారు ఈ దంపతులు.