తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీలుంటే నాకు... లేదంటే ఆమెకు' - స్థానాలు

సిట్టింగ్​ ఎంపీ. మరోమారు టికెట్​ వస్తుందన్న నమ్మకం లేదు. అందుకే... భార్యకైనా దక్కితే చాలని అనుకుంటున్నారు ఒడిశాలోని కొందరు ఎంపీలు. లోక్​సభ సీట్లలో 33% మహిళలకే ఇస్తామన్న బీజేడీ ప్రకటనను ఆసరాగా చేసుకుని... తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితోపాటు టికెట్ల కోసం వరుస కడుతున్న మహిళా నేతలతో పార్టీ కార్యాలయం కళకళలాడుతోంది.

ఒడిశాలోని లోక్​సభ స్థానాల్లో 33శాతం మహిళలకే కేటాయించిన బీజేడీ

By

Published : Mar 18, 2019, 5:21 PM IST

Updated : Mar 19, 2019, 7:55 PM IST

ఒడిశాలోని లోక్​సభ స్థానాల్లో 33శాతం మహిళలకే కేటాయించిన బీజేడీ
ఒడిశాలో లోక్​సభ స్థానాల సంఖ్య 21. అందులో 33శాతం... అంటే 7 సీట్లు మహిళలకే ఇవ్వాలని నిర్ణయించింది అధికార బిజూ జనతా దళ్​. ఈ ప్రకటన... ఎంతో మంది మహిళల్లో ఆశలు రేపింది. వారందరినీ టికెట్ల కోసం పార్టీ కార్యాలయానికి వరుస కట్టేలా చేసింది.

లోక్​సభ సీట్లలో మాత్రమే మహిళలకు 33శాతం ఇస్తామని ప్రకటించింది బీజేడీ. శాసనసభ సీట్లలో రిజర్వేషన్​పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినా... అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక సంఖ్యలో మహిళలను బరిలోకి దించుతుందని భావిస్తున్నారు అంతా. శాసనసభ ఎన్నికల టికెట్​ కోసం తెరవెనుక విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో బీజేడీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

విజ్ఞాపనల పర్వం...

టికెట్లు దక్కవని అనుమానిస్తున్న సిట్టింగ్​ ఎంపీలు... మహిళా రిజర్వేషన్​ను అస్త్రంగా మలుచుకున్నారు. తమకు నిరాకరించినా.. కనీసం తమ భార్యకైనా కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

కోరాపుట్​ ఎంపీ ఝినా హికాకా భార్య కౌశల్య, బాలాసోర్​ ఎంపీ రబీంద​ కుమార్​ జెనా​ భార్య సుభాషిణి, కలహండి ఎంపీ అర్కా కేశరీ దేవ్​ భార్య మాలవికా దేవి... టికెట్ల​ కోసం బీజేడీ అధ్యక్షుడిని కలిశారు.

''నాకు రాజకీయాలు కొత్త. పార్టీ నాకు టికెట్​ ఇస్తుందో లేదో తెలియదు. ఒకవేళ నా భర్తకు నిరాశ ఎదురైతే కలహండీ నుంచి నన్ను పోటీకి దించండి.''
- పట్నాయక్​ను కలిసిన అనంతరం మాలవికా దేవి వ్యాఖ్య

''నా భార్య ఉపాధ్యాయురాలు. కానీ.. ప్రజాజీవితంలో నా వెంటే ఉన్నారు. రాజకీయాలను దగ్గర నుంచి చూశారు. పార్టీ ఈ సారి ఆమెకు టికెట్ ఇస్తుందని భావిస్తున్నాను.''
- కోరాపుట్​ ఎంపీ హికాకా

పోంజీ కుంభకోణంలో ఆరోపణల కారణంగా జెనాకు టికెట్​ దక్కకుంటే... ఆయన భార్య సుభాషిణికి అవకాశం కల్పిస్తారని ఊహాగానాలొస్తున్నాయి. సుభాషిణి సోదరుడు ప్రణబ్​ ప్రకాశ్​ దాస్​ ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయన ద్వారానూ ఎంపీ టికెట్​ కోసం ఆమె తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.

వారికీ ఇబ్బందే...

మహిళలకు రిజర్వేషన్​పై బీజేడీ నిర్ణయంతో.... ప్రత్యర్థి కాంగ్రెస్​, భాజపాపైనా ఒత్తిడి పెరిగింది.

''లోక్​సభ, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్థుల్ని బరిలోకి దించాలని అధిష్ఠానానికి సూచించాం.''
- నిరంజన్​ పట్నాయక్​, ఒడిశా ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు

ప్రస్తుతం ఒడిశా తరఫున లోక్​సభలో ముగ్గురు మహిళా సభ్యులు ఉన్నారు. 147 స్థానాలున్న శాసనసభలో మహిళలు 12 మందే.
ఒడిశాకు లోక్​సభతో పాటే... శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవి నాలుగు దశల్లో ఏప్రిల్​ 11,18, 23, 29 తేదీల్లో జరగనున్నాయి. మే 23న ఫలితాలు ప్రకటించనున్నారు.

Last Updated : Mar 19, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details