తెలంగాణ

telangana

భర్త నమ్మకమే నిజమైంది.. 14ఏళ్లకు తిరిగొచ్చింది

By

Published : Mar 2, 2020, 4:12 PM IST

Updated : Mar 3, 2020, 4:18 AM IST

ఛత్తీస్​గఢ్​ సూరజ్​పుర్​ జిల్లాలో 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేసి తిరిగి ఇంటికి చేరింది ఓ మహిళ. అందరూ ఆమె చనిపోయిందని, భర్తకు మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం ఆ మాటలను నమ్మలేదు. తప్పిపోయిన భార్య కోసం గొప్ప తపస్సు చేసి ఎట్టకేలకు ఆమెను కలుసుకున్నాడు.

woman meet relatives after 14 years help of internet in suarajpur chattisgarh
భర్త నమ్మకమే నిజమైంది.. 14ఏళ్లకు తిరిగొచ్చింది

భర్త నమ్మకమే నిజమైంది.. 14ఏళ్లకు తిరిగొచ్చింది

అందరు ఆమె చనిపోయిందనుకున్నారు. ఆమె భర్తను మరో పెళ్లి చేసుకోమన్నారు. కానీ అతను మాత్రం తన భార్య బతికే ఉందని నమ్మాడు. ఆయన నమ్మకమే నిజమైంది. విడిపోయిన 14 ఏళ్ల తర్వాత తన భార్య ప్రమీలను కలుసుకున్నాడు దులేశ్వర్​.

దులేశ్వర్​, ప్రమీల దంపతులది ఛత్తీస్​గఢ్​లోని సూరజ్​పుర్​ జిల్లా డుమ్రియా గ్రామం. ప్రమీల 2006లో మతిస్తిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కోసం దులేశ్వర్​ వెతకని చోటంటూ లేదు. చుట్టు పక్కల గ్రామాలే కాదు.. ఉత్తర్​ప్రదేశ్,​ మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వెతికాడు. కానీ భార్య జాడ మాత్రం దొరకలేదు.

మరో పెళ్లికి ససేమిరా..

బంధువులంతా ప్రమీల మరణించిందని, ఆమెకు పిండ ప్రదానం చేసేయాలనుకున్నారు. కుటుంబ సభ్యులంతా దులేశ్వర్​ను మరో పెళ్లి చేసుకోవాలని కోరారు. కానీ దులేశ్వర్​ అందుకు ఒప్పుకోలేదు. తన భార్య బతికే ఉందని దృఢంగా నమ్మాడు.

దులేశ్వర్​ నమ్మినట్టే.. దారి తప్పిన ప్రమీల కోల్​కతా​లోని ఓ ఆశ్రమానికి చేరింది. 14 ఏళ్ల తరువాత ఆ ఆశ్రమ డైరెక్టర్ తులసీ మాయతీ​.. ఛత్తీస్​గఢ్​ పోలీసులకు రాసిన ఓ లేఖ ద్వారా తిరిగి ఇంటికి చేరుకుంది.

"2006 అక్టోబర్​ 26న తన భర్య ప్రమీల కనపడటం లేదని దులేశ్వర్​ యాదవ్ భట్​గావ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ, ఎంత ప్రయత్నించినా ఆమె జాడ దొరకలేదు. ఈ ఫిబ్రవరి 6న గార్డెన్​ బంగాల్​ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. డుమ్రియా గ్రామానికి చెందిన ప్రమీల కోల్​కతాలోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోందని, ఆమె భర్త పేరు దులేశ్వర్​ యాదవ్​ అని అందులో రాసుంది. అప్పుడే మేము ఇక్కడి నుంచి ఓ బృందాన్ని పంపించి ఆమెను తీసుకువచ్చాం."

- హరీశ్​ రాథోడ్​, పోలీస్​ అధికారి

చదువు లేక తిప్పలు..

ప్రమీల ఓ రైలు బండిలో బంగాల్​కు చేరింది. అక్కడ ఓ సేవా ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. వారు అందించిన వైద్యంతో ఆమె మానసిక స్థితి కుదుటపడింది. ఆ సమయంలో కుటుంబాన్ని కలవాలని ఎంతగానో పరితపించింది ప్రమీల. కానీ భర్త పేరు, గ్రామం పేరు తప్ప మరే ఇతర చిరునామా తనకు తెలియదు. నిరక్షరాస్యతే ఇన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉంచిందని.. తాను పడ్డ వేదన గురించి ఈటీవీ భారత్​తో పంచుకుంది ప్రమీల.

"నేను వెళ్లేటప్పుడు నాకేమీ తెలియదు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి కోల్​కతా వెళ్లిపోయాను. అదొక్కటే గుర్తుంది. అక్కడికి వెళ్లాక ఇల్లు బాగా గుర్తొచ్చేది. కానీ చదువుకోలేదు కదా.. అందుకే ఎలా వెళ్లాలో తెలియలేదు. కనీసం ఉత్తరం రాయించడానికి పిన్​ నంబరు కూడా తెలియదు. అక్కడి ఓ అధికారి నా గురించి ఛత్తీస్​గఢ్​ పోలీసులకు ఉత్తరం పంపించారు."

-ప్రమీలా యాదవ్​

బాధ్యత గల భర్త..

14 ఏళ్ల క్రితం ప్రమీల ఇంటి నుంచి వెళ్లిపోయాక.. ఐదుగురు బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు దులేశ్వర్​. ఓ వైపు భార్య కోసం గాలిస్తూనే.. వారందరిని పెద్ద చేసి, వివాహాలు చేశాడు. 14 ఏళ్ల అజ్ఞాతవాసంలో ఉన్న ప్రమీల ఎట్టకేలకు సొంతగూటికి చేరడం వల్ల దులేశ్వర్ ఆనందానికి అవధుల్లేవు.

ఇదీ చదవండి:కొత్తరకం కట్నం కోరిన ఐఏఎస్ అధికారి!

Last Updated : Mar 3, 2020, 4:18 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details