తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెద్ద పులుల పండుగ.. సాగిందిలా సంబరంగా!

ఎటు చూసినా పెద్ద పులులే.. నోళ్లు తెరిచి రౌద్రంగా చూస్తున్నాయి. కొన్నేమో ఉత్సాహంగా నాట్యం చేస్తున్నాయి. యువతీ యువకులు పులులను సెల్ఫీలు కోరితే సంతోషంగా ఫోజులిస్తున్నాయి. కొన్ని పులులు పిల్లలను నవ్విస్తున్నాయి. ఇదంతా ఏదో వింతలా తోస్తోందా? కాదు నిజమే. ఇదంతా పులీక్కళి వేడుకల్లో భాగమే.

By

Published : Sep 15, 2019, 4:17 PM IST

Updated : Sep 30, 2019, 5:26 PM IST

కేరళ పెద్దపులుల పండుగ.. సాగిందిలా సంబరంగా!

పెద్ద పులుల పండుగ.. సాగిందిలా సంబరంగా!

మూడు వందలకు పైగా పులులు.. అందులో మూడు ఆడ పులులు. రంగురంగుల చిరుతలు.. కాళ్లకు గజ్జెకట్టి, నడుముకు గజ్జెల ఒడ్డానం పెట్టి ఒక్క చోట చేరి చిందులేశాయి. కేరళ త్రిస్సూర్​లో ఓనం ముగింపు వేడుకల్లో సంప్రదాయ పులీక్కళి నృత్యాలు మరింత శోభను నింపాయి.

ఎటు చూసినా ఉత్సాహమే..

ఏటా జరిగే పులిక్కళి ఉత్సవాల్లో ధైర్యానికి ప్రతీకగా ఉండే పులి వేషాలు ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే అనాధిగా పులి వేషధారణలో నృత్యం చేసి తోటివారిని ఉత్సాహపరిచి ఓనం వేడుకలను ముగిస్తారు.

గతేడాది వరదల కారణంగా ఈ ప్రాంతంలో పులీక్కళి వేడుకలు రద్దయ్యాయి. కానీ ఈ సారి మాత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుక కోసం స్వరాజ్​ మైదానంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ ఉత్సవం తెల్లవారే వరకు కోలాహలంగా సాగింది.

పులులా.. మనుషులా?

వివిధ ప్రాంతాల నుంచి ఆరు బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో 51 మంది చొప్పున మూడు వందలకు పైగా కళాకారులుంటారు. వారంతా ఉదయం నాలుగింటి నుంచే సంప్రదాయ రంగులు పూసుకుని శరీరాలను పులిలా మార్చుకున్నారు. పెద్ద పులుల చారలు, చిరుత పులుల మచ్చలు ఇలా రకరకాల పులి అవతారాల్లో సిద్ధమయ్యారు.

పులి వేషం వేసుకున్న వారంతా.. ప్రత్యేక సంగీత తాళం ఛండమేళానికి కదం తొక్కారు. ఈ సుందర ఘట్టాన్ని చూసేందుకు వచ్చిన వేలాది మంది.. బెబ్బులులన్నీ ఒకే చోట చేరి నర్తిస్తుంటే ఆనందంతో కేరింతలు కొట్టారు.

ఆడపులిడా..

2016 నుంచి ఆడవారు కూడా ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. ఆడవారూ, పులి వస్త్రాలు ధరించి పులి నాట్యం చేస్తున్నారు. ఈ సారి ముగ్గురు మహిళలు ఆడపులి అలంకరణలో ఆకట్టుకున్నారు.

సర్కారు ప్రోత్సాహం

ఈసారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక్కో బృందానికి లక్షా యాభై వేల రూపాయలు ప్రకటించింది స్థానిక కార్పొరేషన్. ప్రత్యేక ప్రదర్శన చేసి విశేషంగా అలరించిన బృందానికి మొదటి బహుమతిగా 40వేల రూపాయలిచ్చారు. రెండో స్థానంలో నిలిచిన బృందానికి 30వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి 25వేల రూపాయలు అందజేశారు.

ఇదీ చూడండి:శస్త్రచికిత్స చేస్తుంటే హుషారుగా పాటలు పాడింది!​

Last Updated : Sep 30, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details