తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యూహం మార్చనున్న చైనా.. అరుణాచల్​ ప్రదేశ్​పై గురి! - china eyeing on arunachal pradesh

భారత్‌కు పక్కలో బల్లెంలా ఉండి కొన్ని దశాబ్దాలుగా అనేక సమస్యలను సృష్టిస్తూ వస్తోంది డ్రాగన్ దేశం. ఇటీవల లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా కవ్వింపులతో భారత్‌ అప్రమత్తమైంది. చైనా దుందుడుకు చర్యలను తిప్పికొట్టేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయబోమంటూ సైనిక దళాలు, వాయుసేనలను మోహరించింది. భారత‌ ఎదురుదాడిని ఏ మాత్రం ఊహించని చైనా.. వ్యూహాల్లో మార్పులు చేయనున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో సమస్యలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చైనా తరువాతి టార్గెట్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ కావచ్చని విశ్లేషిస్తున్నారు.

With no de-escalatory disengagement, China may be eyeing Arunachal Pradesh for next move
వ్యూహం మార్చనున్న చైనా.. అరుణాచల్​ ప్రదేశ్​పై గురి!

By

Published : Jul 5, 2020, 4:54 AM IST

Updated : Jul 5, 2020, 7:01 AM IST

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలతో భారత్‌ అస్త్రశస్త్రాలను పెద్దఎత్తున మోహరించిన వేళ.. చైనా తన వ్యూహం మార్చుకుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో దశబ్దాలుగా వివాదాస్పదం చేస్తూ వస్తున్న అరుణాచల్‌పై మరోసారి డ్రాగన్‌ దృష్టి పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తదుపరి వ్యూహంలో భాగంగా చైనా మరిన్ని బలగాలను అరుణాచల్‌ సరిహద్దులో మోహరించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాతో 1,126 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది అరుణాచల్‌ ప్రదేశ్‌. అక్కడ సమస్యలను సృష్టించటం ద్వారా భారత బలగాలను ఆయా ప్రాంతాల్లో మోహరించేలా చేసి ఇతర ప్రాంతాల్లో భద్రతను బలహీన పరిచేందుకు చైనా కుట్ర పన్నుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మెుత్తం 25కు గానూ 13 జిల్లాలు చైనా, భూటాన్‌, మయన్మార్‌లతో సరిహద్దులను కలిగి ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత భూభాగంగా చైనా గుర్తించటం లేదు. ఇప్పటికీ తమ ప్రాంతంగానే భావిస్తోంది. చైనీయులు అరుణాచల్‌ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పిలుస్తారు. లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖ మాదిరిగా.. టిబెట్‌ సహా ఈశాన్య భారతానికి మధ్య సరిహద్దుగా మెక్‌మోహన్‌ రేఖ ఉంది. దీనిని 1914లో బ్రిటిష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శి ఆర్థర్‌ హెన్రీ మెక్‌ మోహన్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో దీన్ని బ్రిటిష్‌ ఇండియా, టిబెట్‌లు అంగీకరించాయి. కానీ చైనా మెక్‌మోహన్‌ రేఖను అంగీకరించటం లేదు. అరుణాచల్‌ లోని 65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తోంది.

అక్కడి పరిస్థితులు వేరు..

చదునైన పర్వత ప్రాంతంగా ఉన్న ఎల్​ఏసీ మాదిరిగా కాకుండా మెక్‌మెహన్‌ సరిహద్దుల్లో రాతి బంజరు భూమి, పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఫలితంగా అరుణాచల్‌లో పెద్ద సంఖ్యలో దళాలను మోహరించడానికి భారీగా ఖర్చవుతుంది. సుదీర్ఘకాలం గస్తీ కాయడం, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి పహారా కాయటం సైనికులను శారీరకంగా అలసటకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య.. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి లెఫ్టినెంట్‌ జనరల్‌ నిర్భయ్‌ శర్మ పీఎంఓకు లేఖ రాశారు. ఇండో-చైనా సరిహద్దులోని కఠినమైన భూభాగాలను కలుపుతూ మెక్‌మెహన్‌ రేఖను తాకే విధంగా చైనా రహదారులను నిర్మించిందని లేఖలో ప్రస్తావించారు. అయితే భారత రోడ్‌ హెడ్స్‌ చాలా వరకూ సరిహద్దుకు 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపట్టడం వల్ల పరిస్థితి కాస్త మెరుగుపడుంది. కానీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. చైనా ఎత్తుగడను ముందస్తుగా అంచనా వేసి యుద్ధ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.

ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో భారత వాయుసేన యుద్ధ సన్నద్ధత

Last Updated : Jul 5, 2020, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details