తెలంగాణ

telangana

ఇంద్రప్రస్థ ఎవరిది? గెలుపుపై ఎవరి ధీమా వారిదే!

By

Published : Feb 7, 2020, 8:18 AM IST

Updated : Feb 29, 2020, 12:01 PM IST

దిల్లీ గద్దెను ఎక్కేది ఎవరు? అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీని 'సంక్షేమం' గట్టెక్కిస్తుందా? విపక్ష భాజపాను 'హిందూత్వ వ్యూహం' గెలిపిస్తుందా? మూడో పక్షం కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి? మరో 24 గంటల్లో దిల్లీ ఓటరు తన మనోగతాన్ని ఆవిష్కరించనున్న తరుణంలో అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్నలివి.

who will win the delhi assembly elections 2020
దిల్లీ ఎలక్షన్ 2020

ఆప్‌, భాజపా మధ్య ద్విముఖ పోరు విస్పష్టంగా కనిపిస్తున్న ఈ ఎన్నికల్లో.. గెలుపు తమదంటే తమదని ఈ రెండు పార్టీలూ ధీమాగా చెబుతున్నాయి.
భాజపా శక్తి ఎంత?

గత ఏడాది లోక్‌సభ, 2017లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తే.. అదే ఊపు కొనసాగితే.. ఈ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా గెలిచి తీరాలి. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 57% ఓట్లతో దిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ సీట్లనూ తన ఖాతాలో వేసుకుంది. 22.46% ఓట్లతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో, 18% ఓట్లతో ఆప్‌ మూడోస్థానంలో నిలిచాయి. 2017లో దిల్లీలోని 3 మున్సిపల్‌ కార్పొరేషన్లనూ భాజపా క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే ఫలితాలు ఇప్పుడూ వస్తాయని, షాహీన్‌బాగ్‌ నిరసనలకు వ్యతిరేకంగా తమకు నిశ్శబ్ద మెజారిటీ వస్తుందని కమలనాథులు ఆశిస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయంతో హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయని నమ్ముతున్నారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయ్‌

దేశంలోని ఇతర రాష్ట్రాలకు, దిల్లీకి సంపదపరంగా తేడాలున్నాయి. 2015-16 జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే ప్రకారం- దిల్లీలో అత్యల్ప ఆదాయం ఉన్న వారు(దేశంలోని 20% మంది నిరుపేదల్లో) కేవలం 0.2%. ఈ కారణం వల్ల మోదీ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఉదాహరణకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్‌ కనెక్షన్ల పథకం) కింద కేవలం 77 వేల కనెక్షన్లు ఇచ్చారు. దిల్లీలోని మొత్తం నివాసుల్లో ఇది 2.2 శాతం. ఈ కనెక్షన్ల పరంగా 19 రాష్ట్రాల కన్నా దిల్లీ వెనుకబడి ఉంది. భాజపా హిందూత్వ రాజకీయాలకు తాము సైద్ధాంతిక ప్రత్యామ్నాయం కాదని, ఐదేళ్ల తమ పరిపాలనను చూసి ఓటేయాలని ఆప్‌ చేస్తున్న ప్రచారం కమలనాథుల్ని కొంత ఇరుకున పెడుతోంది.

ఆప్‌ బలాలేమిటి?

ఐదేళ్లుగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ఆప్‌ బాగా ఆశలు పెట్టుకుంది. 20 వేల లీటర్ల నెలవారీ వినియోగానికి ఎలాంటి నీటి పన్నును విధించకపోవడం, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 400 యూనిట్ల వరకు రాయితీలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో పరిస్థితుల్ని మెరుగుపరచడం, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటు, మహిళలకు డీటీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై నియంత్రణలు, అవినీతి రహిత పాలన ఇలాంటివన్నీ తమను గెలిపిస్తాయని ఆప్‌ నమ్ముతోంది. అవినీతి విషయంలో జాతీయ స్థాయిలో నరేంద్రమోదీ ఎంత స్వచ్ఛంగా ఉన్నారో.. దిల్లీలో కేజ్రీవాల్‌ అంతే స్వచ్ఛంగా ఉన్నారన్న ప్రచారమూ సాగుతోంది.

కాంగ్రెస్‌ వైపు ముస్లింల చూపు!

ఆప్‌ను ప్రత్యామ్నాయ లౌకిక పార్టీగా ముస్లింలు ఇప్పటికీ నమ్మడం లేదని, అందుకే కాంగ్రెస్‌వైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఆర్టికల్‌ 370 రద్దుకు ఆప్‌ మద్దతిచ్చింది. సీఏఏకు వ్యతిరేకంగా జేఎన్‌యూ, షాహీన్‌బాగ్‌లలో జరుగుతున్న నిరసనల్లో ఆప్‌ ముఖ్య నేతలెవరూ పాల్గొనడం లేదు. ఆప్‌ అనుసరిస్తున్న ఈ తటస్థ వైఖరిని భాజపా అందిపుచ్చుకుంటూ.. ఆ పార్టీలోని హిందువుల్ని తనవైపునకు లాక్కొంటోంది. సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ 'అయోధ్య' అస్త్రాన్ని బయటికి తీశారు. ఆలయ ట్రస్టు ఏర్పాటును ప్రకటించారు. దేశ విభజనకు నెహ్రూయే కారణమని, పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కుల్ని చంపేస్తున్నారని.. ఇలా హిందూ భావోద్వేగ అంశాల్ని తెరపైకి తెచ్చి.. ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి?

షీలాదీక్షిత్‌ నేతృత్వంలో దాదాపు 15 ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు భాజపా, ఆప్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటూ.. మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటర్లు చాలా మంది ఆప్‌ వైపు చూస్తున్నారు. హస్తం పార్టీకి బలమైన అభ్యర్థులు దొరకడమే గగనమైపోయింది. పార్టీ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ పోటీచేయకుండా కుటుంబ సభ్యుల్ని బరిలో నిలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు దిల్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఇది ఆప్‌కు కలిసివస్తోందనే వాదన ఉంది. అయితే గాంధీనగర్‌, బద్లీ, శీలంపుర్‌, ముస్తఫాబాద్‌, బల్లిమరాన్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గట్టిపోటీనిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటే ప్రజలు అచ్చంగా కేజ్రీవాల్‌ పాలనను విశ్వసించి ఓటేసినట్లు. భాజపా గెలిస్తే మాత్రం.. హిందూత్వ వాదాన్ని ఒడిసిపట్టడంలో ఆప్‌ విఫలమైనట్లు లెక్క అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముగిసిన ప్రచారం

శనివారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గురువారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు 672 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గందరగోళ పెడుతున్న ఓటర్ల నాడి

పలు ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతం

ఆప్‌కున్న ప్రజా మద్దతు స్థిరమైనది కాదన్న విషయం 2017 కార్పొరేషన్‌ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టంగా రుజువైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు ఆప్‌ పక్షాన కాకుండా కాంగ్రెస్‌ వైపు నిలబడ్డారు. ఉదాహరణకు మతియా మహల్‌, బల్లిమరాన్‌, ఓఖ్లా, శీలంపుర్‌, బాబర్‌పుర్‌, ముస్తఫాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 17% ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇది 39%కి పెరిగింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 52% ఓట్లు పడ్డాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవలం 13% ఓట్లకు ఆ పార్టీ పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్‌ ఓట్లు 28 నుంచి 47%కు పెరిగాయి. ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019లో భాజపాకు 37% ఓట్లు వచ్చాయి.

ఇదీ చదవండి: 'ఆమ్​ఆద్మీ'కి అనైతిక దెబ్బ-సిసోడియా ఓఎస్​డీ అరెస్ట్!

Last Updated : Feb 29, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details