లాక్డౌన్ దాదాపు పూర్తయ్యింది. రద్దీ రహదారులు, వీధుల్లో పెద్ద ఎత్తున జనం, వాణిజ్య సముదాయాల్లో కిటకిట, భారీ ట్రాఫిక్... ఇవన్నీ మళ్లీ తిరిగొచ్చినట్లే! క్రమంగా సాధారణ జీవితం ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. కానీ, ప్రస్తుతం సాధారణ జీవితమే భయానకంగా మారింది. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునే బాధ్యత ప్రజలపైనే పడిపోయింది. దీంతో ప్రజల్లో వైరస్ భయం పెరిగిపోయింది. బయటకు వెళ్తే ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడదు కాబట్టి బయటకు వెళ్లకుండా అసలు ఉండలేము.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎక్కడ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోంది? ఆ ప్రదేశాలకు వెళ్లకుండా మనల్ని మనం నియంత్రించుకునేదెలా?
వైరస్ విజృంభణకు 3 కారణాలు
- ఎక్కువగా జనాలు తిరిగే ప్రదేశాలు
- సరిగా వెంటిలేషన్ లేని ప్రాంతాలు
- బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా మాట్లాడే వ్యక్తులు
ఈ మూడు కారణాల వల్ల కరోనా వ్యాప్తి అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.
ముక్కు, నోరు ద్వారా బయటకు వచ్చిన తుంపర్లే కొవిడ్-19 వ్యాప్తికి ప్రధాన కారణమని చాలా పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. పెద్దపెద్ద తుంపర్లు నేరుగా వేరొకరి కళ్లు, ముక్కు, నోటిలోకి చేరితే ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకుతుందని తేల్చాయి. కానీ ఈ తుంపర్లు గాలిలో ఎక్కువసేపు ఉండకుండా నేలపై పడిపోతాయి. అయితే చిన్న చిన్న తుంపర్లు ఎక్కువ కాలం గాలిలో ఉంటాయని.. వీటిని నేరుగా పీల్చడం ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని మరికొన్ని పరిశోధనలు వెల్లడించాయి.
గాలి ప్రసరణే ముఖ్యం
ఈ రకంగా వైరస్ వ్యాప్తి జరగకుండా అరికట్టాలంటే ప్రతి చోట వెంటిలేషన్ సరిగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పని ప్రదేశాలతో పాటు మనం ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో సరిగ్గా గాలి ఆడేలా చూసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.
కరోనా సోకిన వ్యక్తితో ఎక్కువసేపు గడపడం వల్ల ఇతరులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని చెబున్నారు. ఆరు అడుగుల కన్నా తక్కువ దూరం పాటిస్తూ, 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయం రోగితో గడిపితే వైరస్ వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందని... అంతకన్నా తక్కువ సమయంలోనూ వైరస్ సోకే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు.
కేవలం 10 శాతం మంది ప్రజలే 80 శాతం వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సరైన వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో కరోనా రోగులు ఉండటం వల్ల ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని స్పష్టమైంది.