''70 ఏళ్ల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, బిహార్, అసోం, బంగాల్.. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రానికి పూర్తి హోదా ఉంది. పూర్తి రాష్ట్రం అంటే.. ప్రజలు తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి ఉంటారు. ఆ ప్రభుత్వం చేతుల్లోనే పూర్తి అధికారం ఉంటుంది. ప్రజల కోసం పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు కట్టాలంటే పూర్తి అధికారం వారి చేతుల్లోనే ఉంటుంది.
కానీ.. దిల్లీ మాత్రం 70 ఏళ్లుగా పూర్తి రాష్ట్రం కాదు. సగం రాష్ట్రం మాత్రమే. దిల్లీ ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ.. ఆ సర్కారు చేతుల్లో అధికారం ఉండదు. దేనికైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. పాఠశాల కట్టాలన్నా, కళాశాల నిర్మించాలన్నా కేంద్రం దగ్గరికెళ్లాలి. మేం ఏం పని చేయాలనుకున్నా.. కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ కారణంగా.. 70 ఏళ్లుగా దిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. దిల్లీకి ఇప్పుడు సమయమొచ్చింది. దిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రంగా మారాల్సిందే.''
- 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్
"దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా".. ఇది ఎప్పటినుంచో వినిపిస్తోన్న డిమాండ్. దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఎప్పటినుంచో కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. ఇప్పుడు దిల్లీ శాసనసభ ఎన్నికల వేళ ఆ డిమాండ్ను మరోసారి తెరపైకి తెచ్చింది. తన ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ 'దిల్లీకి రాష్ట్ర హోదా'ను చేర్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.
అసలు దిల్లీకి రాష్ట్ర హోదా ఎందుకు..? ఆప్ ఎందుకంత పట్టుబడుతుంది..? కేంద్రం ఎందుకు వెనక్కు తగ్గుతుంది..? దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందేనా..?
1956 నవంబరు 1న దేశ రాజధాని దిల్లీ... కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైంది. 1991లో దిల్లీకి ఒక అసెంబ్లీ, ముఖ్యమంత్రి వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. ఈ తరహా విధానం దిల్లీ, పుదుచ్చేరి.. తాజాగా జమ్ముకశ్మీర్కు మాత్రమే ఉంది. కాబట్టి దిల్లీ పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతమనిగానీ, పూర్తి రాష్ట్రమని కానీ అనడం కుదరదు.
మా చేతుల్లో ఏం లేదు..!
కేంద్రపాలిత ప్రాంతమే కాక దిల్లీ... దేశ రాజధాని కూడా. భూమి, పాలన, కార్యనిర్వాహక యంత్రాంగం, పోలీసులపై అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. మునిసిపల్, చిన్నాచితకా వ్యవహారాలు మాత్రమే స్థానిక ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి.
అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న దిల్లీలో పెత్తనం.. ఎక్కువగా కేంద్రం చేతిలో, అంటే స్థానికంగా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు ఉంటుంది. ఇదే అక్కడ గొడవ. ప్రతి దాంట్లోనూ స్థానిక ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి వాగ్వివాదాలు. కొంతకాలంగా అధికారాల విషయంలో దిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టూ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
సుప్రీం చెప్పినా ఫలితం మాత్రం..!
సుప్రీం ధర్మాసనం 'దిల్లీ అధికారాల'పై కాస్త స్పష్టతనిచ్చినా ఏం మారలేదు. అవినీతి నిరోధక శాఖ, విచారణ కమిషన్ ఏర్పాటు అంశాలపై ఎల్జీకి నియంత్రణ ఉంటుందని తెలిపింది సుప్రీం. విద్యుత్ బోర్డు, ఎలక్ట్రిసిటీ కమిషన్పై మాత్రం దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని తీర్పు వెలువరించింది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని గతంలో సుప్రీం.. దిల్లీ అధికారాల అంశమై పేర్కొన్నప్పటికీ అది ఏ మాత్రం ఆచరణలో ఉందో చెప్పడం కష్టం. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. ఎల్జీకి నివేదించాలనీ స్పష్టం చేసింది. ఇదెలా ఉందో చెప్పడమూ కష్టమే.
భాజపా మదిలో ఏముందో..?