దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మే 3 వరకు లాక్డౌన్ పొడిగించాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గడువు ముగిసిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ఆంక్షలను కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ విషయంపై కేంద్రం చర్చించలేదని సమాచారం. కానీ మే3 తర్వాత షరతులు, పరిమితులతో కూడిన జీవన విధానానికి అనుమతులిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఇలానే అనుమతులు..
విమాన, రైళ్ల సేవలు మే 3 తర్వాత ప్రారంభం కావని తెలుస్తోంది. కొన్ని రోజులకు నిర్దేశించిన పట్టణాల మధ్య ప్రయాణాలకే అనుమతి ఇస్తారని సమాచారం. కొన్నాళ్లు మాస్క్లు, వ్యక్తిగత దూరం జీవితంలో భాగం కానున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే మాస్క్ ఉంటేనే అనుమతి ఇస్తారట. పెళ్లి వంటి శుభకార్యాలు, మత సమ్మేళనాలపై ఆంక్షలు కొనసాగుతాయి. నిత్యావసరాల దుకాణాలు వ్యక్తిగత దూరం పాటిస్తూ, వినియోగదారులతో పాటింపజేస్తూ అమ్మకాలు జరపొచ్చు.