తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాలేని లక్షద్వీప్- ఎలా సాధ్యమైంది? - Lakshadweep news on corona

ఏడాది కాలంగా ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాల్ని బలితీసుకున్న ఈ రాకాసిపై పోరు కొనసాగుతూనే ఉంది. భారత్‌లోనూ ఈ వైరస్‌ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకూ వ్యాపించిన ఈ మహమ్మారిని లక్షద్వీప్‌ మాత్రం సమర్థంగా తిప్పికొట్టగలిగింది. తమ దీవుల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దేశంలోనే తొలి కరోనా కేసు నమోదైన కేరళ రాష్ట్రానికి పక్కనే ఉన్న లక్షద్వీప్‌ ఈ వైరస్‌ ముప్పు నుంచి ఎలా బయటపడగలిగింది? ఈ చిన్న ద్వీపసముదాయం ఎలా కరోనా రహిత ప్రాంతంగా నిలిచిందో తెలుసుకోవాలి అంటే ఈ కథనం చదవాల్సిందే..

What COVID-19? Life is all normal in Lakshadweep
కొవిడ్‌ రహిత ప్రాంతంగా నిలిచిన లక్షద్వీప్‌

By

Published : Dec 10, 2020, 6:18 AM IST

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రపంచమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఈ వైరస్‌ ప్రభావంతో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారినా లక్షద్వీప్‌లో మాత్రం సాధారణ జనజీవనానికి ఎలాంటి ఆటంకమూ కలగలేదు. అక్కడ మాస్క్‌ల్లేవు.. శానిటైజర్ల వాడకం ఊసేలేదు. కొవిడ్ నిబంధనల్లేవు.. పెళ్లిళ్లు, పండుగలు, బహిరంగ సభలకు ఎలాంటి ఆంక్షలూ అమలు చేయలేదు. ప్రపంచమంతా కొవిడ్‌ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరైనా అక్కడ మాత్రం జనజీవనం సాఫీగానే సాగుతోంది. లక్షద్వీప్‌ ‘జీరో కరోనా’ ప్రాంతంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి కంటైన్‌మెంట్‌ వ్యూహాలను అమలుచేశారనే అంశాలను అక్కడి లోక్‌సభ సభ్యుడు పీపీ మహ్మద్‌ ఫైజల్‌ వివరించారు.

కరవత్తి దీవిలోని లైట్​ హౌస్​

ఎవరికైనా నిబంధనలు ఒక్కటే!

'దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి డిసెంబర్‌ 8 వరకు ఎవరూ కరోనా బారిన పడలేదు. సున్నా కేసులు ఉన్నాయి. మా అధికార యంత్రాంగం తీసుకున్న ముందు జాగ్రత్తలతో ఇది సాధ్యమైంది. 36చదరపు కి.మీల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపానికి ఎవరైనా రావాలనుకున్నా కఠిన నిబంధనలు అమలు చేశాం. సామాన్యుడైనా, అధికారైనా, ప్రజాప్రతినిధి అయినా ఇంకెవరైనా కేంద్ర పాలిత ప్రాంతంలోకి ప్రవేశించాలంటే.. ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే. లక్షద్వీప్‌కు ఓడల్లోనైనా, హెలికాప్టర్లలోనైనా వెళ్లేందుకు ఏకైక కేంద్రంగా ఉన్న కొచ్చిలో ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే'

కొనసాగుతున్న తరగతులు

'దీవుల్లో ఉన్న ప్రజలకు మాత్రం ఎలాంటి నిబంధనలూ అమలు చేయలేదు. అది గ్రీన్‌ ఏరియా కావడం వల్ల మాస్క్‌లు, శానిటైజర్ల వాడకం కూడా లేదు. లక్షద్వీప్‌లో పాఠశాలలు తెరిచే ఉన్నాయి. అక్కడ తరగతులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌ 21 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పాఠశాలలు తెరిచేందుకు అనుమతించిన నేపథ్యంలో సాధారణంగానే అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాలు.. అన్ని మామూలుగానే జరుగుతున్నాయి. లక్షద్వీప్‌లో అంతా సాధారణంగానే ఉంది' అని ఎంపీ తెలిపారు.

పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు

దేశంలో తొలి కేసుతో అప్రమత్తం

'మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదు కావడం వల్ల స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కఠిన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ, దేశీయ పర్యాటకుల రాకను నిలిపివేసింది. లక్షద్వీప్‌లోని ఒక దీవి నుంచి మరో దీవికి కూడా రాకపోకలు నిలిపివేశారు. కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్‌ రాజధాని నగరమైన కవరత్తికి మాత్రమే అనుమతించేవారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న తమ ప్రజలు, లక్షద్వీప్‌లో ఉద్యోగాలు చేసేవారు, లక్షద్వీప్‌కు వైద్య అవసరాల నిమిత్తం వచ్చేవారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. అయితే, లక్షద్వీప్‌కు రావాలనుకునేవారు మాత్రం కోచిలో సంస్థాగత క్వారంటైన్‌లో ఏడు రోజులు ఉండాల్సిందే. ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరించేలా ఏర్పాట్లు చేశారు'

కొవిడ్‌ రహిత ప్రాంతంగా నిలిచిన లక్షద్వీప్‌

నెగెటివ్‌ వస్తేనే ఎంట్రీ

అలాగే, కొచ్చిలో క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నవారికి కొవిడ్‌ టెస్ట్‌లు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. నెగెటివ్‌ వచ్చినవారిని మాత్రమే లక్షద్వీప్‌ వెళ్లేందుకు అనుమతించేవారు. తమ గమ్యస్థానానికి చేరాక అక్కడ మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. దీన్ని వైద్య, పోలీస్‌ అధికారులు పర్యవేక్షిస్తారు.

లక్షద్వీప్‌ దీవులు

నేనూ ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉన్నా..

'కరోనా సమయంలో పార్లమెంట్‌ సమావేశాలు జరగడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను మూడు సార్లు దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. దిల్లీ నుంచి తిరిగి లక్షద్వీప్‌కు వచ్చిన సందర్భంలో అన్ని నిబంధనలూ పాటించాను. కొచ్చిలోని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాను. నెగెటివ్‌గా తేలిన తర్వాత లక్షద్వీప్‌కు వెళ్లా. ఇంటికి వెళ్లాక కూడా మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌ పాటించా. కొచ్చిలో క్వారంటైన్‌లో ఉన్న సమయంలో అనేక కేసులు వచ్చాయి. పాజిటివ్‌గా తేలిన వారిని అక్కడినుంచి వేరే ప్రత్యేక కేంద్రానికి తరలించేవారు. పది రోజుల తర్వాత వారికి మళ్లీ కొవిడ్ పరీక్ష చేయిస్తారు. నెగెటివ్‌ వచ్చినప్పటికీ అన్ని సదుపాయాలతో మరో 14 రోజులు క్వారంటైన్‌లోనే గడిపేలా చర్యలు తీసుకున్నారు. వారికి మరోసారి పరీక్ష చేసిన తర్వాత మాత్రమే లక్షద్వీప్‌కు వెళ్లేందుకు అనుమతించేవారు' అని ఎంపీ ఫైజల్‌ వివరించారు.

దినేశ్వర్​ శర్మ

ఆయనదే కీలక పాత్ర

లక్షద్వీప్‌ మన దేశంలోనే అత్యంత చిన్న కేంద్రపాలిత ప్రాంతం. 36 దీవులతో కూడిన ఓ ద్వీప సమూహం. అన్ని దీవులు కేరళలోని కొచ్చి తీరం నుంచి దాదాపు 220 కి.మీల నుంచి 440 కి.మీల దూరంలో ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్‌ జనాభా 64వేలు. అయితే, లక్షద్వీప్‌ను కరోనా రహితంగా మార్చడంలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన దినేశ్వర్‌ శర్మదే కీలక పాత్ర అంటారు ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌. ఆయన ప్రత్యేక దృష్టిపెట్టి సాధ్యమైనంత కృషిచేశారంటూ ప్రశంసించారు. ఆయనెంతో గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దినేశ్వర్‌ శర్మ ఈ నెల 4న చెన్నైలో ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో కన్నుమూశారు.

ఇదీ చూడండి: 'గత 30-40 ఏళ్లలో చైనాతో ఇదే క్లిష్టమైన దశ'

ABOUT THE AUTHOR

...view details