తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2020, 8:22 PM IST

ETV Bharat / bharat

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం మూడు కీలక బిల్లులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రెండు కొత్త బిల్లులు కాగా.. మరొకటి సవరణ బిల్లు. అధికార పక్షం ప్రవేశపెట్టిన ఈ బిల్లులకు.. లోక్​సభలోనూ ఆమోదం లభించింది. అయితే ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మిత్ర పక్షాలు ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శిరోమణి అకాలీ దళ్ ఎంపీ ఏకంగా తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఆ బిల్లుల్లో ఏముంది? ప్రతి పక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కేంద్రం ఏం చెబుతోంది? అనేది ఓసారి చూద్దాం.

What are some of the new agricultural bills brought by the Center?
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?

  • రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
  • రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
  • అత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు ఇవే. వీటిని ప్రతిపక్షాలతో పాటు అధికార ఎన్డీఏలోని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులపై ప్రభావితం చూపే ఈ బిల్లుల్లో ఏముందో తెలుసుకుందాం.

1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020

రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్​ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్​ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్​ను గానీ పన్నులనూ వసూలు చేయరు.

ఉపయోగాలు ఇవీ..

  • మార్కెటింగ్​ ఖర్చులు తగ్గుతాయి.
  • రైతులు ఇష్టమైన మార్కెట్​ను ఎంపిక చేసుకోవచ్చు.
  • మంచి ధరలను రైతులు పొందవచ్చు.
  • మిగులు ఉత్పత్తి ఉన్న ప్రాంతాల రైతులు కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేసి మెరుగైన ధరలు పొందవచ్చు.

ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి..

రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత మార్కెట్​లో విక్రయించకపోవడం వల్ల రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతాయి. మార్కెట్లో అమ్మకాలు లేకపోవడం వల్ల కమిషన్ ఏజెంట్లు నష్టపోతారు. కనీస మద్దతు ధర ఆధారిత సేకరణ వ్యవస్థ ముగింపునకు.. ఈ చట్టం దారి తీస్తుంది. ప్రైవేట్ సంస్థల దోపిడీకి అవకాశం పెరుగుతుంది.

ప్రధాని ఏమన్నారంటే..

"నూతన బిల్లులు రైతులకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. మధ్యవర్తుల వైపు నిలబడేందుకే కొందరు వీటిని వ్యతిరేకిస్తున్నారు. మూడు చారిత్రాత్మక శాసనాలు ప్రవేశపెట్టడం వల్ల రైతులకు వ్యవసాయంలో కొత్త స్వాతంత్ర్యం లభించింది. ఈ బిల్లులు తెచ్చినా వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం మానదు. కనీస మద్దతు ధర ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

2.రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020

రైతులు నేరుగా అగ్రికల్చర్​ బిజినెస్​ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

ఉపయోగాలు ఇవీ..

  • రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిచవచ్చు.
  • ఈ విధానాన్ని అనుసరించడం వల్ల మార్కెటింగ్​ ఖర్చు తగ్గుతుంది.
  • రైతుల ఆదాయం పెరుగుతుంది.

ప్రతిపక్షాల వాదన ఇదీ..

వ్యవసాయ రంగంలో ఆధిపత్యం చెలాయించే బడా సంస్థలకు అనుకూలంగా ఈ చట్టం రూపొందించబడింది. రైతుల శక్తిని బలహీన పరుస్తుంది. ప్రైవేటు సంస్థలు, ఎగుమతిదారులు, టోకు వ్యాపారులకు ఇది లాభం చేకూరుస్తుంది.

3.అత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిపాయ, బంగాళాదుంపలు వంటి ఉత్పత్తులను అత్యవసర వస్తువుల జాబితా నుంచి తొలగించాలని ఈ సవరించిన ఈ చట్టం చెబుతుంది. యుద్ధం, కరువు లాంటి పరిస్థితుల్లో ఈ వస్తువులపై పరిమితులు ఎత్తివేయాలని నిర్దేశిస్తుంది.

ఉపయోగాలు ఇవీ..

వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను తీసుకురావడం వల్ల ధర స్థిరత్వాన్ని తీసుకురావడం దీని ఉద్దేశం.

ప్రతిపక్షాల వాదన ఇదీ..

వస్తువుల నిల్వకు పెద్ద కంపెనీలకు స్వేచ్ఛ ఉంటుంది. ఇది రైతులను నియంత్రిస్తుంది.

"ఈ బిల్లుల వల్ల రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీ చట్టాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. నూతన బిల్లులు రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరలు పొందేలా చేస్తాయి. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుంది.”"

-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

నాయకులు ఏమన్నారంటే..

"అత్యవసర వస్తువుల సవరణ బిల్లు ఆ ఉత్పత్తులను నియంత్రిస్తుంది. మేము రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గం. రైతులకు ఏది మేలు చేస్తుందో.. అదే చేస్తాం. ఈ సంస్కరణల విషయంలో కొందరు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు.”"

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

" రైతులను దోపిడీ చేసే బిల్లులను భాజపా తీసుకొచ్చింది. రైతులు తమ భూములను బడా బాబులకు తనఖా పెట్టడానికి ఈ బిల్లులు ఉపయోగపడుతాయి. ప్రభుత్వ మార్కెట్లను నియంత్రించే కుట్ర భాజపా చేస్తుంది. వీటివల్ల భవిష్యత్తులో తమ సొంత భూమిలోనే కూలీలుగా మారుతారు."

- అఖిలేశ్​ యాదవ్​, ఎస్పీ అధ్యక్షుడు

"కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఏపీఎంసీ చట్టం (వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ) తీసుకొచ్చింది. భాజపా తీసుకొచ్చిన బిల్లుల వల్ల ఏ వ్యాపారి అయినా మార్కెట్​ను తెరుచుకోవచ్చు. రైతు వ్యతిరేక బిల్లులను అందరూ వ్యతిరేకించాలి. "

దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ABOUT THE AUTHOR

...view details