తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసమ్మతివాదులం కాదు- పునర్​వైభవం కోరుకునేవాళ్లం' - Congress party

కాంగ్రెస్ నాయకత్వం సహా పార్టీలో మార్పులకు సంబంధించి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతలు తాజాగా ఈ విషయంపై స్పందించారు. సోనియా నాయకత్వాన్ని తాము సవాల్ చేయలేదని చెప్పుకొచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధంగా ఉంచాలనే తాపత్రయంతోనే లేఖను రాసినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు పార్టీ నాయకత్వంపై గందరగోళం సృష్టించేందుకే లేఖ రాశారని పీసీ చాకో మండిపడ్డారు.

Voice of dissent should have been raised within CWC meet: PC Chacko
'అసమ్మతివాదులం కాదు- పునర్​వైభవం కోరుకునేవాళ్లం'

By

Published : Aug 25, 2020, 10:45 PM IST

కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టాలని సోనియా గాంధీకి లేఖరాసిన 23 మంది సీనియర్​ నేతల్లో పలువురు ఈ విషయంపై స్పందించారు. తాము అసమ్మతివాదులం కాదని, పార్టీకి పూర్వవైభవం కోరుకునేవారిమంటూ పేర్కొన్నారు. సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని భావించినట్లు తెలిపారు. పార్టీ శ్రేయస్సు కోరుతూ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆందోళనలను పార్టీకి తెలియజేయటమే తమ ఉద్దేశమన్నారు.

'లేఖ ఉద్దేశం అది కాదు'

పార్టీ అధిష్ఠానాన్ని సవాల్ చేయటం తమ లేఖ ఉద్దేశం కాదని, పార్టీని బలోపేతం చేయటానికి చేసిన ప్రయత్నమంటూ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్ఖా స్పష్టం చేశారు.

"మిత్రులారా, మేం అసమ్మతివాదులం కాదు, పార్టీకి పూర్వవైభవం ప్రతిపాదించేవాళ్లం. పార్టీ నాయకత్వాన్ని సవాల్ చేయడం లేఖ ఉద్దేశం కాదు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం. న్యాయస్థానాలైనా, ప్రజా సంబంధ విషయాలైనా సత్యమే రక్షణ కవచం. చరిత్ర ధైర్యవంతులనే గుర్తిస్తుంది, పిరికివాళ్లను కాదు."

-వివేక్ తన్ఖా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు

ఆనంద్ శర్మ

తన్ఖా చేసిన ట్వీట్​పై సీనియర్ నేత ఆనంద్ శర్మ స్పందించారు. తమ మనసులో పార్టీ మేలును కోరుకుంటూ లేఖ రాశామని దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళనలనతో పాటు రాజ్యాంగ మౌలిక విలువలపై జరుగుతున్న దాడులను పార్టీకి తెలియజేయటమే తమ ఉద్దేశమని శర్మ పేర్కొన్నారు. భాజపాకు పోటీగా గట్టి ప్రతిపక్షం అవసరమని అన్నారు. పార్టీ పునర్​వైభవం కోసం నిజాయతీగా చేసే సూచనలను అసమ్మతి అని అనకూడదని ట్వీట్ చేశారు.

మా తాపత్రయం అదే

2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధంగా ఉంచాలనే తాపత్రయంతోనే లేఖను రాసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే స్థితిలో లేదన్న విషయం అంగీకరించిన వాస్తవమేనని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నాయకత్వం పార్టీకి ఎప్పుడూ అవసరమేనని నొక్కిచెప్పారు. తాను కాంగ్రెస్​లో చేరి 50 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు.

"త్యాగం, దేశ భక్తికి గాంధీ కుటుంబం ఎల్లప్పుడు ప్రసిద్ధి చెందింది. సోనియా గాంధీ నాయకత్వం పార్టీకి ఎప్పటికీ అవసరమే. పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగేందుకు సోనియా అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీకి సోనియా తల్లిలాంటివారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడల్లా అధిష్ఠానం పక్కన నిలబడ్డాను."

-వీరప్ప మొయిలీ

ముకుల్ వాస్నిక్

ఈ లేఖను 'నేరం'గా చూసేవారంతా తాము లేవనెత్తిన సమస్యలు... పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేనని త్వరలో గ్రహిస్తారని మాజీ కేంద్ర మంతి ముకుల్ వాస్నిక్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సైతం ఈ విషయంపై స్పందించారు. "ఇది పదవి గురించి కాదు, దేశం గురించి. ఇదే చాలా ముఖ్యమైన విషయం" అంటూ ట్వీట్ చేశారు.

సీడబ్ల్యూసీ భేటీ ఫలితంపై పూర్తి సంతృప్తిగా ఉన్నామంటూ మరో కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంపై ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయలేదని చెప్పారు. సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని అన్నారు. పార్టీ బలోపేతానికే తాము పనిచేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టతనిచ్చారు.

లేఖ రాసిన 23 మంది నేతల్లో కొందరు మాత్రం ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు. తాము లేవనెత్తిన సమస్యలు పార్టీ అంతర్గత విషయాలేనని, మీడియా, ప్రజల ముందు చర్చించేవి కాదని పేర్కొన్నారు.

'ఇదంతా వారి పనే'

మరోవైపు ఈ విషయంపై ఈటీవీ భారత్​తో మాట్లాడిన కాంగ్రెస్​ సీనియర్​ నేత పీసీ చాకో.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఇష్టపడని వారే దీని వెనక ఉన్నారంటూ ఆరోపించారు. పార్టీ నాయకత్వంపై గందరగోళం సృష్టించేందుకే లేఖ రాశారని అన్నారు.

ఈటీవీ భారత్​తో మాట్లాడిన పీసీ చాకో

"పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ సీడబ్ల్యూసీ భేటీకి ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలికి లేఖ రాయడం, దానిని మీడియాకు లీక్ చేయడం సిగ్గుచేటు."

-పీసీ చాకో, కాంగ్రెస్ సీనియర్ నేత

లేఖ వల్ల పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదని చాకో పేర్కొన్నారు. ఇది కొత్త సమస్యలను తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:ఆరు నెలల తర్వాతే కాంగ్రెస్​కు కొత్త సారథి!

ABOUT THE AUTHOR

...view details