తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్ణయాత్మక విడత- ప్రముఖులకు పరీక్ష

సార్వత్రిక సమరంలో చివరి దశకు వచ్చేశాం. నిర్ణయాత్మకమైందిగా విశ్లేషకులు చెబుతున్న ఏడో విడతలో పలువులు కీలక అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు, సినీనటులు ఉన్నారు.

By

Published : May 18, 2019, 3:12 PM IST

Updated : May 18, 2019, 4:59 PM IST

చివరి దశ ఎన్నికలు

నిర్ణయాత్మక విడత- ప్రముఖులకు పరీక్ష

17వ లోక్​సభ ఎన్నికల్లో చివరి ఘట్టం ఏడోవిడత పోలింగ్ రేపటితో ముగియనుంది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాల్లో 918 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రవిశంకర్​ప్రసాద్​, హర్​ సిమ్రత్ ​కౌర్​ బాదల్​, లోక్​సభ మాజీ స్పీకర్​ మీరా కుమార్​, బంగాల్​ సీఎం మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.

నరేంద్రుడి స్థానంలో నామినేషన్ల వివాదం

ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న స్థానం కావటం వల్ల వారణాసిపై ఆసక్తి సాధారణమే. మోదీపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తొలుత ఊహాగానాలు వచ్చాయి. ప్రియాంక అందుకు అనుకూలంగా ప్రకటనలూ చేశారు. చివరకు... ఆమె బరిలో దిగడం లేదని ప్రకటించింది కాంగ్రెస్​ అధిష్ఠానం. అజయ్​ రాయ్​కు వారణాసి టికెట్​ ఇచ్చింది. 2014లోనూ మోదీపై పోటీ చేసి, ఓడిపోయారు ఆయన. ఇప్పుడు మరోమారు తలపడుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల రైతుల ఆందోళనలతో వారణాసి పోరు మరింత రక్తి కట్టింది. నామినేషన్ల విషయంలో అనేక వివాదాలు నడిచాయి. 111 మంది రైతులు కాశీలో నామినేషన్​కు సిద్ధమైనా.. కొన్ని పరిణామాల దృష్ట్యా వెనక్కితగ్గారు. నిజామాబాద్ పసుపు రైతులు మోదీపై పోటీ చేస్తామని కాశీ వెళ్లారు. అయితే వారికి నామపత్రాల దాఖలులో​ చిక్కులు తప్పలేదు. స్థానికుల మద్దతు లేని కారణంగా ఈసీ తిరస్కరించింది.

మాజీ జవాను, ఎస్పీ బలపరిచిన తేజ్​బహదూర్​ యాదవ్​ నామినేషన్​ తిరస్కరణ వివాదంగా మారింది. సుప్రీం కోర్టును ఆశ్రయించినా యాదవ్​కు నిరాశ తప్పలేదు. చివరకు వారణాసి నుంచి 42 మంది పోటీలో ఉన్నారు.

గోరఖ్​పుర్​లో సర్వం 'యోగి'నే

గోరఖ్​పుర్​... ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. 1998 నుంచి 2017 వరకు ఇక్కడ ఎంపీగా గెలిచారాయన. సీఎం అయ్యాక యోగి రాజీనామాతో 2018లో ఉపఎన్నికల్లో జరిగాయి. అనూహ్యంగా ఆ స్థానాన్ని ఎస్పీ ఎగరేసుకుపోయింది.

గోరఖ్​పుర్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భాజపా. భోజ్​పురి ప్రముఖ నటుడు రవికిషన్​ను పోటీకి దింపింది. రవి కిషన్​ను గెలిపించడాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నారు ఆదిత్యనాథ్​. ప్రచార పర్వంలో అన్నీ తానై నడిపించారు.

2018 ఉపఎన్నికల్లో భాజపా ఓటమికి ప్రధాన కారణం... ఎస్పీ-బీఎస్పీ పొత్తు. ఇప్పుడూ ఆ రెండు పార్టీల మైత్రి అలానే కొనసాగుతుంది. యోగి కంచుకోటలో ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరం.

సహచరుల సమరం

బిహార్​ పట్నాసాహిబ్​లో ఒకప్పటి సహచరులే ప్రత్యర్థులు. భాజపా నుంచి కాంగ్రెస్​లోకి వెళ్లిన సిట్టింగ్ ఎంపీ శతృఘ్న సిన్హాకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ను దింపింది కాషాయ పార్టీ.

పంజాబ్​ ఫిరోజ్​పుర్​ స్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ సిట్టింగ్​ ఎంపీ షేర్​ సింగ్ ఘుబాయా 2014లో శిరోమణి అకాలీదళ్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన ఆయనపై బలమైన అభ్యర్థిని నిలపాలని శిరోమణి భావించింది. అందుకోసం పార్టీ ప్రధాన అస్త్రం, అధినేత సుఖ్​బీర్​ బాదల్ రంగంలోకి దిగారు.

పంజాబ్​లో ​సన్నీపైనే భాజపా ఆశలు

ఇటీవల భాజపాలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్​. పంజాబ్​ గురుదాస్​పుర్​ స్థానం నుంచి బరిలో దిగారు.

మరికొందరు కీలక అభ్యర్థులు

  1. కేంద్రమంత్రి హర్​సిమ్రత్​ కౌర్ బాదల్ (శిరోమణి) - బఠిండా(పంజాబ్)
  2. లోక్​సభ మాజీ స్పీకర్​ మీరాకుమార్(కాంగ్రెస్) - సాసారామ్​(బిహార్​)
  3. అభిషేక్​ బెనర్జీ (తృణమూల్​) - డైమండ్ హార్బర్(బంగాల్​)
  4. అనురాగ్​సింగ్ ఠాకూర్ (భాజపా) ​- హమీర్​పుర్​(హిమాచల్​ ప్రదేశ్​)
  5. మిమీ చక్రవర్తి (తృణమూల్​) - జాదవ్​పుర్(బంగాల్​)
  6. సినీనటి నుస్రత్​ జహాన్​ రుహి(తృణమూల్​)- బషీర్​హాట్(బంగాల్​)

ఇదీ చూడండి: భారత్​ భేరి: ప్రజలు కాదు... 'పొత్తులే' నిర్ణేతలు!

Last Updated : May 18, 2019, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details