తెలంగాణ

telangana

దుబేకు బేడీలు ఎందుకు వేయలేదు? చట్టం ఏమంటోంది?

By

Published : Jul 10, 2020, 6:39 PM IST

వికాస్​ దూబే ఎన్​కౌంటర్​పై దేశవ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి సంకెళ్లు ఎందుకు వేయలేదనేదే ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే ఖైదీలకు సంకెళ్లు వేయకూడదనే ఓ నిబంధన ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఏకంగా భారత అత్యున్నత న్యాయస్థానమే సంకెళ్లు వేసే పద్ధతిని చాలా సందర్భాల్లో వ్యతిరేకించింది.

Vikas Dubey's killing raises handcuffing issue vis-a-vis SC guidelines on "inhuman" practice
దుబేకు బేడీలు ఎందుకు వేయలేదు? చట్టం ఏమంటోంది?

'అమానవీయం, అసమంజసం, కఠినాత్మకం, ఏకపక్షం'...నేరస్థులకు సంకెళ్లు వేసే పద్ధతిపై భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలివి. ఖైదీ అత్యంత ప్రమాదకరంగా ఉండి, వారిని నియంత్రించడానికి వేరే ఇతర మార్గాలు లేనప్పుడే సంకెళ్లు వేయాలని వివిధ సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు.

సంకెళ్లకే పోలీసుల ఓటు

అయితే పోలీసులు మాత్రం నేరస్థుల చేతికి సంకెళ్లు వేయడానికే మద్దతిస్తున్నారు. భయంకరమైన నేరస్థులు కస్టడీ నుంచి పారిపోకుండా ఉండేందుకు సంకెళ్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

దుబే ఘటన

ఉత్తర్​ప్రదేశ్​లో 8 మంది పోలీసులను బలిగొన్న కరుడుగట్టిన నేరస్థుడు వికాస్​ దుబే ఎన్​కౌంటర్​ నేపథ్యంలో ఈ సంకెళ్ల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. గురువారం అరెస్టయిన అతడ్ని ఈ ఉదయం కాన్పుర్​కు తరలిస్తుండగా కారు బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్​ నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు దుబే. వెంటనే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు.

దుబే చేతులకు సంకెళ్లు వేయకపోవడంపై ప్రస్తుతం దుమారం చెలరేగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకున్నట్లు తెలుస్తుండగా.. అసలు సంకెళ్లు ఎందుకువేయకూడదనే వాదన చర్చనీయాంశంగా మారింది.

సంకెళ్లు వేయకుండానే దుబేను తీసుకెళ్తున్న పోలీసులు

కోర్టుల అనుమతి లేకుండా సంకెళ్లు వేయడం చట్టవిరుద్ధమని 1995లోనే అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చేతికి సంకెళ్లు వేసి కనీసం స్వేచ్ఛగా కదలకుండా అడ్డుకోరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. నేరస్థులు పారిపోకుండా కాపాడేందుకు సంకెళ్లు తప్పనిసరేం కాదని స్పష్టం చేసింది.

'ఇతర మార్గాలున్నాయ్'

ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ దిల్లీ ప్రభుత్వం కేసులో సైతం సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. నేరస్థులను పారిపోకుండా ఉంచేందుకు క్రూరంగా, అగౌరవంగా సంకెళ్లతో బంధించడం కన్నా ఇతర మార్గాలు ఉంటాయని పేర్కొంది.

"సంకెళ్లు వేయడం ప్రాథమికంగా అమానవీయం. కాబట్టి అది అసమంజసం, అత్యంత కఠినమైనది, ఏకపక్షమైనది. సరైన విధానం, లక్ష్యం లేకుండా జంతువులకు వేసినట్లు వీటిని ఉపయోగించడం ఆర్టికల్ 21కి విరుద్ధం. ఖైదీని పారిపోకుండా కాపాడటం, వారి వ్యక్తిత్వాన్ని రక్షించడం.. రెండూ కూడా సామరస్యంగా ఉండాలి."

-సుప్రీంకోర్టు

విచారణ ఖైదీలు పారిపోకుండా కాపాడటం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

"ఒక మనిషి చేతులు, కాళ్లు కట్టేయడం, అతని అవయవాలను ఉక్కుతో బంధించడం, కోర్టులలో గంటలపాటు నిలబెట్టడం అంటే అతన్ని హింసించడం, అతని గౌరవాన్ని అపవిత్రం చేయడం అవుతుంది. అది మన రాజ్యాంగ ఆత్మకు వ్యతిరేకం."

-సుప్రీంకోర్టు

ఆర్టికల్ 14, 19 ప్రకారం అవసరం లేకున్నా సంకెళ్లు వేయడం అనేది నిరంకుశత్వమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఖైదీ అత్యంత ప్రమాదకరమై, వారిని నియంత్రించే పరిస్థితులు లేకపోతే తప్ప ఇలాంటి మార్గాలు అనుసరించడం అసమంజసమని స్పష్టం చేసింది.

సంకెళ్లు ఎవరికి వేస్తారు?

ఒకవేళ నేరస్థుడు చాలా ప్రమాదకరమని, జైలు గోడ దూకి పారిపోతాడని పోలీసులు బలంగా భావించినప్పుడు కోర్టును సంప్రదించాలి. న్యాయస్థానం ఎదుట నేరస్థుడిని హాజరుపర్చి అనుమతి తీసుకోవాలి. పోలీసుల అభ్యర్థనను పరిశీలించి సంకెళ్లు వేసేందుకు న్యాయస్థానం అనుమతిస్తుంది.

'సంకెళ్ల' రాజకీయం

దుబే వ్యవహారంపై యూపీలోని ప్రతిపక్షాలు మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్​కౌంటర్​పైనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. సంకెళ్లు వేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నాయి. న్యాయవిచారణకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లకు యోగి సర్కార్ తలొగ్గితే... దుబే కథ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details