తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటన

2+2 చర్చల కోసం అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్​కు విచ్చేయనున్నారు. మంగళవారం భేటీ జరగనుండగా.. ఇవాళ(సోమవారం) భారత్​కు రానున్నారు. ఇండో పసిఫిక్​లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్​లో దుందుడుకు వైఖరిపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు.

By

Published : Oct 26, 2020, 5:34 AM IST

Updated : Oct 26, 2020, 5:47 AM IST

US Secretary of State Mike Pompeo & Defence Secretary Mark Esper to arrive in India on Monday
అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ భారత్​కు సోమవారం విచ్చేయనున్నారు. భారత్, అమెరికా మంత్రుల మంగళవారం జరిగే 2+2 చర్చల్లో ఇరువురు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల సమయం మిగిలుండటం, సరిహద్దులో భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య జరగనున్న ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సమావేశాలు భారత్, అమెరికా మధ్య జరగనున్న మూడో 2+2 చర్చలు కావడం విశేషం. భారత్​ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొంటారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఇండో పసిఫిక్​లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్​లో దుందుడుకు వైఖరి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు విడివిడిగానూ సమావేశం కానున్నారు. పాంపియో, ఎస్పర్​లు.. ప్రధాని మోదీతో సైతం భేటీ అవుతారని అధికారులు తెలిపారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్​లో ఉన్న బేఈసీఏ(బేసిక్ ఎక్స్ఛేంజీ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్)ను ఇరుపక్షాలు ఖరారు చేసుకుంటాయని తెలుస్తోంది. ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది. అధునాతన సైనిక సాంకేతికత, లాజిస్టిక్స్, జియోస్పేషియల్ మ్యాప్స్​ను పంచుకొనేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుంది.

నిబద్ధతకు నిదర్శనం

రెండేళ్ల వ్యవధిలోనే భారత్-అమెరికా మధ్య మూడోసారి 2+2 చర్చలు నిర్వహించడం ఇరుదేశాల నిబద్ధతకు నిదర్శనమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య లోతైన ప్రజాస్వామ్య సంస్కృతి నెలకొందని పేర్కొంది. వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విమానయానం, శాస్త్రీయ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం బలోపేతమవుతోందని స్పష్టం చేసింది. పాంపియో, ఎస్పర్​ భారత్​కు బయలుదేరిన నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది.

భారత్​కు బయలుదేరుతున్న మైక్ పాంపియో
Last Updated : Oct 26, 2020, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details