చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ భారత అమ్ములపొదిలోకి మరో ఐదు అపాచీ హెలికాప్టర్లు చేరాయి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఒప్పందంలో భాగంగా ఇవ్వాల్సిన 22 హెలికాప్టర్లలో తుది ఐదింటిని భారత వైమానిక దళానికి అందించింది.
ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున.. కొత్త వాటినీ అదే ప్రాంతంలో మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఐదేళ్లకు...
22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2015 సెప్టెంబర్లో బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్.
కొత్తగా 5 హెలికాప్టర్ల రాకతో... ఒప్పందం ప్రకారం అందించాల్సిన 22 అపాచీ, 15 చినూక్ సైనిక హెలికాప్టర్ల డెలివరీ పూర్తయినట్లు తెలిపారు బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఎండీ సురేంద్ర అహుజ.
"సైనిక హెలికాప్టర్లు అందించటం ద్వారా మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. వైమానిక దళ అవసరాలకు తగిన సామగ్రిని అందించేందుకు భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లలో ఆధునాతన టార్గెటింగ్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా పగలే కాదు రాత్రిళ్లు కూడా లక్ష్యాన్ని గుర్తించవచ్చు. భూమిపై, గాలిలోనే కాదు సముద్ర వాతావరణంలోనూ పనిచేయగలిగేలా ఫైర్ కంట్రోల్ రాడార్ను నవీకరించాం. కమాండర్ల అవసరాలను తీర్చేందుకు ఇది ఉపయోగపడుతుంది."
- సురేంద్ర అహుజ, ఎండీ-బోయింగ్ డిఫెన్స్ ఇండియా
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక బహుళ ప్రయోజనకర యుద్ధ హెలికాప్టర్లలో ఏహెచ్-64ఈ అపాచీ ఒకటి. ఇప్పటికే అమెరికా సైన్యంలో వినియోగంలో ఉంది. చినూక్ అనేది బహుళ పాత్ర పోషించే, ఉన్న చోటి నుంచే గాల్లోకి ఎగరగల సామర్థ్యం ఉన్న హెలికాప్టర్. వీటిని ప్రధానంగా బలగాలు, యుద్ధ సామగ్రి, ఇంధనాన్ని రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.
ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా మరో 6 అపాచీ హెలికాప్టర్ల కోసం ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇదీ చూడండి:సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. రాత్రి వేళ హెలికాప్టర్ల గస్తీ