తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక టీచర్​.. 25 పాఠశాలలు.. రూ.కోటి వేతనం

ఓ ఉపాధ్యాయురాలు ఏక కాలంలో 25 పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు గుర్తించి షాక్​కు గురయ్యారు ఉత్తర్​ప్రదేశ్​ అధికారులు. కొద్ది నెలలకు గాను మొత్తం కోటి రూపాయలు వేతనాన్ని అక్రమంగా పొందినట్లు తెలుసుకున్నారు. హాజరు పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ టీచరమ్మకు ఇది ఎలా సాధ్యమైందని అధికారులు విచారణ జరుపుతున్నారు.

By

Published : Jun 5, 2020, 3:00 PM IST

Updated : Jun 5, 2020, 3:07 PM IST

UP teacher simultaneously 'worked' at 25 schools, took home Rs 1cr salary
ఒకేసారి 25 పాఠశాలల్లో పనిచేస్తున్న టీచరమ్మ.. వేతనం రూ.కోటి!

ఓ ఒప్పంద ఉపాధ్యాయురాలు ఏక కాలంలో 25 పాఠశాలల్లో విధులు విధులు నిర్వహిస్తూ.. గత కొద్ది నెలలకు గానూ వేతనంగా రూ.కోటి పొందింది. నమ్మశక్యం కాకపోయినా ఇది వాస్తవమేనని అధికారిక వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​లోని కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)లో సైన్స్​ టీచర్​గా ఉన్న అనామికా శుక్లా.. ఆరు జిల్లాల్లోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నట్లు డేటాబేస్​లో వివరాలున్నాయి. కొద్ది నెలల్లోనే ఆమె మొత్తం కోటి రూపాయల వేతనం కూడా తీసుకున్నట్లు ఉంది. ఒకప్పుడు రాయ్​బరేలీ జిల్లాలో విధులు నిర్వహించిన ఆమె, ఇప్పుడు అంబేడ్కర్ నగర్​, బాగ్​పత్​, అలీగఢ్​, సహారణ్​పుర్​, ప్రయాగ్​ రాజ్​ జిల్లాల్లో ఏకకాలంలో విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్న వివరాలు చూసి అధికారులు షాక్​కు గురయ్యారు.

ఉపాధ్యాయుల హాజరు వివరాలకు సంబంధించి పర్యవేక్షణ ఉన్నా.. ఇది ఎలా సాధ్యమై ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు. నిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ జనరల్​ విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు.

అలా వెలుగులోకి వచ్చింది...

మానవ్ సంపద్​ పోర్టల్​లోని డిజిటల్ డేటాబేస్​లో ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, ఉద్యోగంలో చేరిన తేదీ, పదోన్నతి వంటి వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వివరాలు పరిశీలిస్తుండగా అనామికా శుక్లా పేరుతో ఉన్న టీచర్​ గత ఏడాది కాలంగా 25 పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నట్లు ఉంది. 2020 ఫిబ్రవరి వరకు మొత్తం వేతనం రూ.కోటికి పైగా తీసుకున్నట్లు తెలిసింది.

అధికారులు వెంటనే ఈ విషయంపై విచారణ ప్రారంభించారు. 6 జిల్లాల అధికారులకు లేఖలు పంపారు. అనామికా పేరుతో ఎవరైనా ఉంటే వివరాలు తెలియజేయాలని కోరారు.

అనామికా శుక్లా గతంలో రాయ్​బరేలీలోని కేజీబీవీలో విధులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరి వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఆ తర్వాత నుంచి వివిధ జిల్లాలోని 25 పాఠాశాలల్లో పనిచేస్తున్నట్లు ఉంది.

స్పందన లేదు..

అనామికా శుక్లాకు నోటీసులు పంపినట్లు విజయ్​ ఆనంద్ చెప్పారు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఎవరికీ అందుబాటులో లేరని పేర్కొన్నారు.​ లాక్​డౌన్ కారణంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదని, ప్రస్తుతానికి రికార్డులు పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఆమెకు వేతనాన్ని నిలిపివేశామన్నారు.

యూపీలో వెనకబడిన వర్గాల బాలికల కోసం కేజీబీవీ పాఠశాలలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధ్యాయులను నియమిస్తోంది. వేతనం నెలకు రూ.30వేల వరకు ఉంటుంది.

Last Updated : Jun 5, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details