ఉత్తర్ప్రదేశ్ కన్నౌజ్కు చెందిన ఓ కుటుంబం మెంతికూర అనుకుని.. గంజాయి కూర తిని ఆసుపత్రిపాలైంది. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం వారంతా మియాగంజ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కన్నౌజ్కు చెందిన నవల్ కిశోర్ ఎండిన గంజాయి తెచ్చి ఓం ప్రకాశ్ కుమారుడు నితీశ్కు ఇచ్చాడు. ఇది ఎండబెట్టిన మెంతికూర అని సరదాగా చెప్పాడు. విషయం తెలియక ఈ ఎండు గంజాయిని తీసుకెళ్లి వదిన పింకీకి ఇచ్చాడు నితీశ్ . పింకీ గంజాయిని కూర వండేసింది.
మెంతి కూర అనుకుని గంజాయి కూరతోనే కుటుంబంతా భోంచేశారు. ఇంకేముంది.. కాసేపటికే అందరికీ కళ్లు తిరగడం మొదలెట్టాయి. ఓంప్రకాశ్ అతి కష్టం మీద బయటకు వెళ్లి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పాడు. కాసేపటికే ఇంట్లో అంతా స్పృహ తప్పి పడిపోయారు.