చైనా ఆర్మీ తమను తాము బాధ్యతాయుతమైన బలగాలుగా చెప్పుకుంటున్నప్పటికీ.. వారి సైనికుల ప్రవర్తన అలా లేదని భారత సైన్యాధికారులు తెలిపారు. ఇటీవల లద్ధాఖ్లోని ప్యాంగొంగ్ ట్సో సరస్సు ప్రాంతంలో భారత సైనికులతో ఘర్షణకు దిగినప్పుడు చైనా బలగాలు కర్రలు, ముళ్ల తీగలు, రాళ్లు ఉపయోగించినట్లు పేర్కొన్నారు అధికారులు. చైనా జవాన్ల ప్రవర్తన అత్యంత అనైతికంగా ఉందన్నారు.
" చైనా జవాన్ల ప్రవర్తన కశ్మీర్ లోయలో భారత భద్రతా దళాలపై రాళ్లదాడులు చేసే పాకిస్థాన్ ఆధారిత దుండగుల మాదిరిగా ఉంది. ప్యాంగొంగ్ ట్సో సరస్సు ప్రాంతంలో భారత బలగాలతో ఘర్షణకు దిగిన సందర్భంలో చైనా బలగాలు కర్రలు, ముళ్ల తీగలు, రాళ్లను ఉపయోగించాయి. ఆ సమయంలో చైనా సైనికుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్న భారత సైనికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వారి జవాన్లు అనైతిక ఆర్మీలా ప్రవర్తించారు. భారత సైన్యం మన పరిధిలోని ప్రాంతాల నుంచి చైనీయులను వెనక్కి పంపేందుకు ఎప్పుడూ అలాంటి వ్యూహాలను ఉపయోగించదు. "