తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్​లాక్ 2.0: కేంద్రం కీలక మార్గదర్శకాలివే.. - unlock 2.0 center guidelines

అన్‌లాక్‌-2.0 విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది.

Unlock 2.0: The Center's Key Guidelines
అన్​లాక్ 2.0: కేంద్రం కీలక మార్గదర్శకాలు

By

Published : Jun 30, 2020, 5:27 AM IST

Updated : Jun 30, 2020, 6:37 AM IST

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించింది. మంగళవారం నాటితో అన్‌లాక్‌-1.0 ముగుస్తోంది. దీనితో జులై 1 నుంచి అన్‌లాక్‌ 2.0 మొదలుపెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను దశలవారీగా అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, నిషేధించిన కొన్ని కార్యకలాపాలు మినహా మిగతావన్నీ వాటి వెలుపల నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు, ఈ-పర్మిట్ల అవసరం లేకుండా ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని స్పష్టం చేసింది.

జులై 31 వరకు నిషేధం అమలయ్యేవి ఇవి..

  • పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాలు
  • కేంద్ర హోంశాఖ అనుమతించినవి మినహా మిగిలిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
  • మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు
  • సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, భారీ సమావేశాలు

ఏవేవి నడుస్తాయి?

  • దేశీయ విమానాలు, రైళ్ల రాకపోకలను ఇప్పటికే పరిమితంగా అనుమతించారు. వాటిని భవిష్యత్తులో క్రమంగా విస్తరిస్తారు.
  • ఆన్‌లైన్‌, దూరవిద్య విధానాలను కొనసాగించుకోవచ్చు.
  • జులై 15 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలు తెరుచుకోవచ్చు. వీటి నిర్వహణకు అవసరమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీచేస్తుంది.
  • కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ప్రార్థన మందిరాలు, హోటళ్లు, అతిథ్య సేవలు, షాపింగ్‌ మాళ్లు.

రాత్రి కర్ఫ్యూ యథాతథం

  • రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగించాలి. అత్యవసర కార్యకలాపాలను, జాతీయ/ రాష్ట్ర రహదారుల్లో ప్రజల రాకపోకలను, సరకు రవాణాను, బస్సులు/ రైళ్లు/ విమానాలు దిగి ప్రజలు వారి గమ్యస్థానాలకు వెళ్లేటప్పుడు అడ్డుకోకూడదు.
  • కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జారీచేసే మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్తగా కంటైన్‌మెంట్‌ జోన్లను నిర్ధారించాలి.
  • ఈ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతివ్వాలి. ఈ జోన్ల బయట వైరస్‌ ప్రబలడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను బఫర్‌ జోన్లుగా గుర్తించాలి. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కంటైన్‌మెంట్‌ జోన్ల బయట కొన్ని కార్యకలాపాలపై రాష్ట్రాలు ఆంక్షలు విధించుకోవచ్చు.

వీటిని అడ్డుకోకూడదు

  • ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక రాష్ట్ర పరిధిలోనే ఒకచోట నుంచి మరొక చోటకు వెళ్లడానికి మనుషులపై కానీ, సరకు రవాణాపై కానీ ఆంక్షలు విధించడానికి వీల్లేదు. ఇలాంటి రాకపోకలకు ప్రత్యేక అనుమతులు/ ఈ-పర్మిట్లు అవసరం లేదు.
  • ప్యాసింజర్‌ రైళ్లు, శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, దేశీయ విమాన ప్రయాణాలు, విదేశాల్లో నిలిచిపోయిన భారతీయుల తరలింపు, భారత్‌ నుంచి విదేశీయుల తరలింపు, సముద్రంలో రాకపోకలు ఇప్పటికే జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి.

ఇదీ చూడండి:నేడు భారత్​ - చైనా లెఫ్టినెంట్​ జనరళ్ల భేటీ

Last Updated : Jun 30, 2020, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details