ఆరుగాలం కష్టపడే రైతు ఇక తనకిష్టమైన ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛ లభించనుంది. తన ఉత్పత్తికి మరెవరో ధర నిర్ణయించడంతో శ్రమకు తగ్గ ఫలానికి దూరమవుతున్న అన్నదాతకు ఆ కష్టం తీరనుంది. రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇందుకోసం జారీ చేసే రెండు అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్లు), ఒక చట్టసవరణ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.
"వ్యవసాయ సంస్కరణలతో సానుకూల ప్రభావం చిరకాలంగా పెండింగ్లో ఉన్న ఈ వ్యవసాయ సంస్కరణలతో గ్రామీణ భారతం రూపాంతరీకరణ చెందుతుంది. ఒకే భారత్-ఒకే వ్యవసాయ మార్కెట్ అన్నది సాకారం దాల్చుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడానికి, వివాదాల పరిష్కారానికి తగిన వ్యవస్థలు ఏర్పాటవుతాయి. వ్యాపారులతో లావాదేవీలు నిర్వహించేటప్పుడు రైతులకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. వారి ప్రయోజనాలకు భద్రత ఉంటుంది."
-ప్రధాని నరేంద్ర మోదీ
- రైతులు ఇకమీదట తమ పంటలను ఇష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చిన ధరకు విక్రయించుకొనే వీలు.
- పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి రైతులు కుదుర్చుకొనే ఒప్పందాలకు చట్టబద్ధత.
- నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి చిరుధాన్యాలు, నూనెగింజలు, వంటనూనెలు, ఉల్లి, బంగాళా దుంపలను తొలగించి నిల్వల పరిమితులపై ఆంక్షల ఎత్తివేత.
ఈ మూడు నిర్ణయాలూ రైతులకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుతాయని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
ఈ-వ్యాపారానికి వెసులుబాటు
ప్రస్తుతం మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)ద్వారా లైసెన్స్ పొందిన వ్యాపారులకు మాత్రమే పంటలు అమ్మాల్సి ఉంది. వారు చెప్పిన ధరకే విక్రయించక తప్పని పరిస్థితి. దీన్ని తొలగిస్తూ ‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహం, సదుపాయ అత్యవసర ఆదేశాల’ను ప్రభుత్వం తీసుకురానుంది. దీంతో రైతులు ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఎలక్ట్రానిక్ వేదికపైనైనా తనకు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. ఈ వ్యవహారం అంతా మండీ బయటే జరుగుతుంది. ఇందులో ఎలాంటి పన్నులూ, తనిఖీలు ఉండవు. అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. పాన్కార్డ్ ఉన్న ఎవరైనా రైతుల నుంచి కొనుగోళ్లు చేయొచ్చు. ఈ-ప్లాట్ఫామ్స్ తయారు చేసుకొని సరకును విక్రయించుకోవచ్చు. సరకు కొన్నరోజు నుంచి మూడు రోజుల్లోపు వ్యాపారులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమయితే కోర్టు బయటే పరిష్కారం చేసుకోవాలి.
ధరలపై చట్టబద్ధ ఒప్పందాలు