దేశ విద్యా రంగంలో సమూల మార్పులకు నాంది పలికింది కేంద్రం. 21 శతాబ్దానికి అనుగుణంగా కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఈ మేరకు 2020 జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది. మరోవైపు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును విద్యా శాఖగా మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మారిన పరిస్థితుల మధ్య విద్యలో సాంకేతికతకు పెద్దపీట వేసింది మోదీ సర్కార్. ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. 2035 నాటికి 50 శాతం స్థూల ఎన్రోల్మెంట్ రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా హక్కు చట్టం కింద మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య తప్పనిసరి చేసింది.
కొత్త విద్యా విధానంలోని కీలకాంశాలు:
- సంపూర్ణ, మల్టీ డిస్ప్లినరీ విద్య- సబ్జెక్టుల ఎంపికలో సరళత్వం
- డిగ్రీ- 3 లేదా 4 సంవత్సరాలు
- పీజీ విద్య- 1 లేదా 2 సంవత్సరాలు
- డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్యవధి ఏడాదిగా నిర్ణయం
- ఇంటిగ్రేటెడ్ పీజీ 5 సంవత్సరాలు
- ఎంఫిల్ కోర్సు ఎత్తివేత
- పరిశోధన, బోధనా ప్రాధాన్యం ఉన్న విశ్వవిద్యాలయాలు, డిగ్రీ అందించే అటానమస్ కాలేజీల ఏర్పాటు
- ప్రతి జిల్లాకు దగ్గర్లో మోడల్ మల్టీ డిస్ప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు
గ్రేడింగ్లో మార్పులు
గ్రేడింగ్ విధానాల్లో సమూల మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది. కళాశాలల అనుసంధానమయ్యే విధానాన్ని దశలవారీగా తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 45 వేల కళాశాలలు విశ్వవిద్యాలయాలు, సంస్థలకు అనుసంధానమై ఉన్నాయి. అక్రిడేషన్ను బట్టి ఆయా కళాశాలలకు అకడమిక్, పరిపాలన, ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తి కల్పించనున్నారు.
ఇక నుంచి విద్యార్థుల రొటీన్ అభ్యాసానికి బదులుగా వాస్తవ జ్ఞానాన్ని పరీక్షించేలా పరీక్షలు నిర్వహించాలని నూతన విద్యా విధానంలో ప్రతిపాదించింది కేంద్రం. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన చేసేలా నిర్ణయం తీసుకుంది. మార్కులు, స్టేట్మెంట్లు కాకుండా నైపుణ్య, సామర్థ్యాల ఆధారంగా సమగ్ర ప్రోగ్రెస్ రిపోర్టులు రూపొందించేలా మార్పులు చేసింది.
- అకాడమీ, పరిపాలనా, ఆర్థిక విభాగాల్లో గ్రేడెడ్ స్వయం ప్రతిపత్తి కల్పించడం
- అఫిలియేషన్ వ్యవస్థను వచ్చే 15 సంవత్సరాల నాటికి దశలవారీగా తొలగించడం
- మార్గదర్శకత్వం కోసం 'నేషనల్ మిషన్ ఆన్ మెంటరింగ్' ఏర్పాటు
- న్యాయ, వైద్య విద్య సహా హయర్ ఎడ్యుకేషన్ మొత్తానికి ఒకే నియంత్రణ వ్యవస్థ
- త్వరలోనే విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు జీడీపీలో 6 శాతానికి చేర్చడం
- ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన
- విద్యార్థులకు పూర్తి వివరాలతో '360 డిగ్రీ' ప్రోగ్రెస్ కార్డు
- నేషనల్ అసెస్మెంట్ సెంటర్-పరాఖ్ ఏర్పాటు
- ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్టీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష
- నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్(ఎన్పీఎస్టీ) ఏర్పాటు
- జవాబుదారీ కోసం ఆన్లైన్ విధానంలో స్వీయ బహిర్గత(సెల్ఫ్ డిస్క్లోజర్) ప్రక్రియ
ఆర్ట్స్, సైన్స్ తేడా ఉండదిక..
ఇంటర్మీడియేట్ను తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా.. దాన్ని 5+3+3+4గా మార్చింది. ప్రాథమిక అక్షరాస్యతపై ప్రధానంగా దృష్టిసారించనుంది. పాఠ్యాంశాల బోధనా నిర్మాణంలో ప్రధాన మార్పులు చేసింది. ఆర్ట్స్, సైన్స్ విద్య మధ్య విభజనలు లేకుండా నూతన విద్యా విధానాన్ని ఆమోదించింది.
- చిన్నారుల ప్రాథమిక సంరక్షణ విద్యను సార్వజనీకరణ చేయడం
- ప్రాథమిక అక్షరాస్యతపై ప్రత్యేక దృష్టితో జాతీయ మిషన్
- విద్యా విధానాన్ని 5+3+3+4గా మార్పులు
- శాస్త్రీయ 21వ శతాబ్దపు నైపుణ్యాలతో కూడిన పాఠ్య ప్రణాళిక,
- ఆర్ట్స్, సైన్స్ మధ్య విభజనలు తొలగింపు, కరిక్యులర్- ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలు, వొకేషనల్- అకాడమిక్ మధ్య వ్యత్యాసం తొలగింపు
- కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకు విద్యా బోధన
- ప్రధానమైన విషయాలకే పాఠ్యప్రణాళికలు పరిమితం చేయడం
- ఆరో తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్
సాంకేతిక విద్య
నూతన విద్యా వ్యవస్థలో సాంకేతికతకు పెద్ద పీట వేసింది కేంద్రం. ప్రాంతీయ భాషల్లో ఈ- కంటెంట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. జాతీయ విద్యా సాంకేతిక ఫోరంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
- విద్య ప్రణాళిక- బోధన, అభ్యాసం, పరీక్షలు(అసెస్మెంట్)- పరిపాలనా నిర్వహణలో సాంకేతికత జోడించడం
- నియంత్రణ సంబంధిత అంశాల్లో మానవ జోక్యాన్ని తగ్గించడం
- వెనకబడిన సమూహాలకు సాంకేతిక అందుబాటులోకి తీసుకురావడం
- దివ్యాంగులకు ఉపయుక్తమైన విద్యా సాఫ్ట్వేర్
- ప్రాంతీయ భాషల్లో ఈ-కంటెంట్
- వర్చువల్ ల్యాబ్ల ఏర్పాటు
- జాతీయ విద్యా సాంకేతిక ఫోరం(ఎన్ఈటీఎఫ్) ఏర్పాటు
- పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులను డిజిటల్ మాధ్యమాలకు సిద్ధం చేయడం